– ప్రతి ఒక్కరికీ అభినందనలు
– మంత్రులు, కార్పొరేషన్ల చైర్మెన్లు ప్రచారం చేసినా కార్మికులు మావైపే : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రులు, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు, అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా నమ్మకంతో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో గుర్తింపు సంఘంగా తమ అనుబంధ యూనియన్ను గెలిపించిన ప్రతి ఒక్క కార్మికునికీ సీఐటీయూ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. గురువారం ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కనీస వేతనాల బోర్డు చైర్మెన్ జనక్ప్రసాద్, సెట్విన్ సంస్థ చైర్మెన్ గిరిధర్ స్వయంగా పోటీచేసినా కార్మికులు సీఐటీయూ వైపే నిలబడటం వెనుక ఆ కంపెనీలో చేసిన మెరుగైన వేతన ఒప్పందాలే కారణమని పేర్కొన్నారు. కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడంలోనూ, కార్మికుల హక్కులను కాపాడటంలోనూ తమ సంఘం ఎప్పుడూ ముందువరుసలో ఉందని తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు డబ్బులు విచ్చల విడిగా ఖర్చుచేసినా, మద్యాన్ని పంపిణీ చేసినా, రాష్ట్ర ప్రభుత్వ అండతో బెదిరించినా కార్మికులు సీఐటీయూ వెనుకే నిలబడటం గొప్ప విషయమని పేర్కొన్నారు. నిరంతరం కార్మికులకు అందుబాటులో ఉండటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని వివరించారు. ఐఎన్టీయూసీ భ్రమలకు గురికాకుండా సీఐటీయూని గెలిపించిన ప్రతి కార్మికునికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కార్మికులంతా ఏకోన్ముఖంగా తమ హక్కుల కోసం పోరాడాలనీ, దానికి సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్మికులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ విజయం కార్మికులదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES