నవతెలంగాణ-హైదరాబాద్: తనపై దాడి చేసిన న్యాయవాదిపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేసేందుకు సిజెఐ జస్టిస్ బి.ఆర్.గవారు నిరాకరించారని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. న్యాయవాదికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు సిజెఐ తిరస్కరించారని పేర్కొంది. కోర్టులో నినాదాలు చేయడం, వస్తువులను విసిరేయడం కోర్టు ధిక్కరణ చర్యల కిందకు వస్తాయని జస్టిస్ సూర్యకాంత్ ,జస్టిస్ జోమాల్య బాగ్చి లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే చట్టప్రకారం కేసు కొనసాగించాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తిపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.
ధిక్కార నోటీసు జారీ చేయడంతో న్యాయవాదికి అనవసరమైన ప్రాముఖ్యత లభిస్తుందని, ఘటన కాలపరిమితి పెరుగుతుందని పేర్కొంది. ఘటన సహజ మరణం పొందేలా చూడాలని తెలిపింది. సిజెఐపై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిషోర్పై ధిక్కార చర్య తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సిబిఎ) దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం నేడు విచారించింది. ఇటువంటి ఘటనలను నివారించేందుకు మార్గదర్శకాలు రూపొందించడాన్ని పరిశీలిస్తామని తెలిపింది. వివిధ కోర్టుల్లో జరిగిన ఇటువంటి సంఘటలన వివరాలను క్రోడీకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
అక్టోబర్ 6న విచారణ జరుగుతుండగా కోర్టు గదిలో సిజెఐపై న్యాయవాది షూ విసిరిన సంగతి తెలిసిందే. ఈ చర్యను వ్యతిరేకిస్తూ బార్ కౌన్సిల్ అతని లైసెన్స్ను తక్షణమే రద్దు చేసింది.



