Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంవక్ఫ్‌ విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ

వక్ఫ్‌ విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ

- Advertisement -

– 15కు విచారణ వాయిదా
– 13న సీజేఐ సంజీవ్‌ ఖన్నా పదవీవిరమణ
– త్వరలో నూతన సీజేఐగా బీఆర్‌ గవారు బాధ్యతల స్వీకరణ
– ఆ తర్వాతే ఈ పిటిషన్లపై విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

వక్ఫ్‌ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై విచారణను మే 15న జస్టిస్‌ బీఆర్‌ గవారు ధర్మాసనం ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించింది. ఈ నెల 13న ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నా పదవీవిరమణ చేయనున్నారు. నూతన సీజేఐగా త్వరలో బీఆర్‌ గవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లను నూతన సీజేఐ ధర్మాసనం ఎదుట విచారించాలని సుప్రీంకోర్టు తెలిపింది. వక్ఫ్‌సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 72 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును విచారించింది. ఏప్రిల్‌ 17న సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ కన్నా, జస్టిస్‌ సంజరు కుమార్‌, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మే 5కి వాయిదా వేసింది. విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కేంద్రం హామీ ఇచ్చింది. వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. అలాగే, వక్ఫ్‌ కౌన్సిల్‌, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. అన్ని రకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రూపొందించినట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టును గడువు కోరారు. దీంతో ధర్మాసనం వారం రోజులు గడువునిస్తూ కేసు విచారణను మే 5కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని, వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే ఉండాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. దీనిని వివిధ రాష్ట్రాల్లోని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశాయి. మరోవైపు ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలు సైతం చోటు చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -