నవతెలంగాణ-హైదరాబాద్: మలయాళ చిత్రసీమ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా వ్యాపిస్తున్న పుకార్లకు ఆయన సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ తెరదించారు. మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మాట వాస్తవమే అయినా, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రిట్టాస్ స్పష్టం చేశారు.
జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ, “మేమిద్దరం చాలా కాలంగా మంచి స్నేహితులం. అయితే, మా వ్యక్తిగత విషయాల గురించి మేం ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోం. కానీ, కొన్ని రోజులుగా ఆ వివరాలను కూడా పంచుకుంటున్నాం. మమ్ముట్టికి చిన్న అనారోగ్య సమస్య ఉంది. దానికి ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఆయన క్షేమంగానే ఉన్నారు. నేను ఇప్పుడే ఆయనతో ఫోన్లో మాట్లాడాను” అని తెలిపారు. ఈ ప్రకటనతో మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది.