Saturday, June 14, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివారిని క్లీన్‌ బౌల్డ్‌ చేయండి

వారిని క్లీన్‌ బౌల్డ్‌ చేయండి

- Advertisement -

ఐపీఎల్‌ సీజన్‌ ముగిసినా క్రికెట్‌ భాషే తేలిగ్గా అర్థమౌతుందనే ఈ ‘క్లీన్‌ బౌల్డ్‌’ అనే మాట వాడటం. ఇంతకీ విషయమేమిటంటే.. ”కేసీఆర్‌ ఒక చరిత్ర! ఆయన్నంటే తెలంగాణను అన్నట్టే! ప్రపంచాద్భుతాన్ని, అన్నీ తానై సృష్టిస్తే దాన్లో ఒక్క పిల్లర్‌ కుంగితే ఇంత హంగామా చేస్తారా!” అంటాడు పుత్రరత్నం! ”రేవంత్‌పై కేటీఆర్‌ అవాకులూ, చెవాకులూ పేలితే చెమ్డాలు వలుస్తా”మంటాడు మాజీ విద్యార్థి నాయకుడైన ఒక శాసనసభ్యుడు. ఈ రెండు పిల్లుల తగాదాలో తెలంగాణ రొట్టె ముక్క తన నోట్లో పడొచ్చన్న ఆశతో ”కాళేశ్వరంపై ఇంతలొల్లి ఎందుకు? సీబీఐకిచ్చేయమనండి, ఒక పనైపోతుంది” అంటూ ”ఆయన్ని చూశారు, ఈయన్ని చూస్తున్నారు. ఈసారి మాకొక ఛాన్సిచ్చి చూడండి! డబల్‌ ఇంజన్‌ ధమాకా ఎలా ఉంటుందో చూపిస్తాం” అంటాడు ఓ కాషాయనేత.
ఈ మూడు స్తంభాలాటలో అధికారమే నాలుగో స్తంభం. వచ్చినదాన్ని నిలబెట్టుకోవడానికి ఒకరి తాపత్రయం. పోయినదాన్ని పారేసుకున్న చోటే వెతుక్కోవడానికి మరొకరి ఆరాటం. నయానో, భయానో కొందరినైనా లొంగదీసుకుని అధికారాన్ని లాక్కోవడానికి ఇంకొకరి ప్రయత్నం. ఈ మధ్యలో ‘మిస్‌’ అవుతున్నది ప్రజలు, ప్రజాసమస్యలు.
నీరు పల్లమెరుగుననే విషయం చిన్న పిల్లోడికి సైతం తెలుసు. దేశంలో అమలు జరిగే విధానాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుండి కిందికి పాకుతాయనే విషయం విడమరిచి చెప్తేనే జనానికి అర్థమవుతుంది. ప్రభుత్వరంగాన్ని మూసేయడం (హెచ్‌ఎంటి, హెచ్‌ఇసి, ఐడీపీఎల్‌లాగా) ప్రయివేటీకరించడం (బాల్కో, హిందుస్థాన్‌ జింక్‌ లాగా) ఉధృతంగా సాగుతున్నాయి బీజేపీ హయాంలో. విద్యుత్‌, రవాణా, విద్య, వైద్యం వంటి సేవా రంగాలన్నీ ప్రయివేటు వారి చేతిలో పెట్టేందుకు ప్రతి బడ్జెట్‌ను సాధనం చేసుకుంటోంది కేంద్ర సర్కార్‌. ఉదాహరణకు రైల్వేపై ఒకేసారి ప్రయి’వేటు’వేయకుండా స్టేషన్లను, సిగలింగ్‌ వ్యవస్థను, ట్రాక్‌ మెయిన్టెనెన్స్‌ను, రోలింగ్‌ స్టాక్‌ (ఇంజన్లు, బోగీల) తయారీ, మెయిన్టెనెన్స్‌ను, చివరికి రైల్వే పోలీసుల (ఆర్‌పీఎఫ్‌)ను సైతం ప్రయివేటుకివ్వడం నేడు చూస్తున్నాం. యాక్సిడెంట్లు జరిగినపుడు మంత్రుల మొసలి కన్నీరు, అధికారగణం ఎవరో ఒకర్ని బలిపశువుల్ని చేయడం తప్ప మరేముంది. మొన్నటికి మొన్న జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఓవర్‌లోడ్‌ (లగేజ్‌) చేయడం కూడా ఒక కారణంగా బయటికొస్తోంది. 250 మంది ప్రాణాలు పోయిన తర్వాత ఏం గుణపాఠాలు తీస్తే ఏం ప్రయోజనం?
ఈ విధానాల ప్రభావం అన్ని రాష్ట్రాల్లో కనపడుతోంది. కాంగ్రెస్‌ పాలనలో ఉపాధి శూన్యమన్నారు మోడీ. మేకిన్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియాలు దేశంలో ఉపాధిని పెంచలేదు. దాంతో మోడీ తెగించి పకోడీలు చేసుకోవడం కూడా ఉపాధే కదా అంటూ దావోస్‌లో చెప్పారు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం కంటే ముందు నర్మదా తీరంలో పెట్టిన సర్దార్‌ పటేల్‌ విగ్రహంగాని, ఆ తర్వాత తయారైన మన షాద్‌నగర్‌లోని రామానుజాచార్యుల విగ్రహంగాని చైనాలోనే రూపొందాయి. మరి ఇండియాలో ఉద్యోగాలెలా వస్తాయి మోడీజీ? గత 50 ఏండ్లలో లేనంత నిరుద్యోగం నేడుందని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి.
అతి పెద్ద ఉపాధి క్షేత్రమైన వ్యవసాయం, దాని తర్వాతి స్థానంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు నేడు కుదేలైనాయి. వ్యవసాయ జీడీపీ తగ్గడమే కాదు 2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయంపై ఆధారపడిన జనాభా 54.6శాతం నుండి తాజాగా 46.1శాతంకు చేరింది.
దేశంలో ఆహార భద్రతను ఫణంగా పెట్టి ఇథనాల్‌ తయారీ కోసం మోడీ సర్కార్‌ చట్టాలన్నింటినీ చుట్టేసి అనుమతులిస్తున్న తీరు ఆశ్చర్యమే కదా మరి! కనీసం గ్రామ సభ ఆమోదముండాలన్న రూల్‌ను కూడా మడిచి గూట్లో పెట్టారు. అనేక సరుకులపై జీఎస్టీ తగ్గించాలని చివరికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అడుగుతున్నా తల అడ్డంగా తిప్పుతున్న మోడీ సర్కార్‌… ఇథనాల్‌పై జీఎస్టీ 18 నుండి 5 శాతానికి తగ్గించడం వెనకెవరున్నారు? 2025 నాటికి ప్రతి లీటర్‌ పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్‌ ఉండాలన్న రూల్‌గానీ, ఆహారధాన్యాలతో ఇథనాల తయారీగానీ దేశంలో ఆహార భద్రత ప్రమాదంలో పడటానికి కారణం కాదా!?
బీఆర్‌ఎస్‌ ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి 2018 వరకు బీజేపీతో అంటకాగిందంటే అర్థం చేసుకోవచ్చు. కాని దేశంలో కాంగ్రెస్‌, బీజేపీతో ఢ అంటే ఢ అంటున్నట్టు చెప్పుకుంటున్న వారు కూడా అలాగే చేయదలచుకున్నారా? మొదట మోడీని ‘పెద్దన్నా’ అని సంబోధిండం, నేడు బండారు దత్తాత్రేయని ‘అజాత శత్రువ’ంటూ కితాబివ్వడమే కాదు.. తాను ‘బీజేపీ స్కూల్లో చదువుకున్నానని, టీడీపీ కాలేజీలో ప్యాసై, రాహుల్‌గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా’నని మన ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవటం ద్వారా కనీసం కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఏమి సందేశం పంపదల్చుకున్నారు? పీవీ నర్సింహారావును మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ ఆకాశానికెత్తడం దేనికి సూచన? వీరికి ఆ వ్యక్తులకంటే వారి విధానాలే ముఖ్యం… అది చెప్పకుండా వ్యక్తుల చుట్టూ రాజకీయాల్ని తిప్పుతూ సంసారం నెట్టుకొస్తున్నారు.
ఇటువంటి విధానాలు అవలంభించే వారిని క్లీన్‌బౌల్డ్‌ చేసి, ప్రజా సమస్యల్ని ప్రధాన ఎజెండాగా చెయ్యాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -