Monday, June 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం'హర్మూజ్‌ జలసంధి' మూసివేత

‘హర్మూజ్‌ జలసంధి’ మూసివేత

- Advertisement -

– ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం
– భారత్‌పైనా ప్రభావం..రూపాయికీ దెబ్బే
టెహరాన్‌:
వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్‌ అనుకున్నంత పని చేసింది. తమ దేశంలోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్‌, అమెరికా బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో.. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్‌ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు ప్రపంచదేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్‌ ద్వారానే రవాణా అవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్‌ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం రెండుకోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది.
భారత్‌ పైనా ప్రభావం
ఇరాన్‌ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్‌ తన అవసరాల్లో 90శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందులో 40శాతం హర్మూజ్‌ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ప్రభుత్వం తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువపైనా ప్రభావం చూపిస్తుంది.ఇప్పటికే బ్యారెల్‌ ముడిచమురు ధర 90 డాలర్ల వద్ద కదలాడుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో భారత్‌ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ చమురును తీసుకొచ్చే నౌకలు ఒమన్‌-ఇరాన్‌ సముద్ర మార్గంలో ఉన్న హర్మోజ్‌ జల సంధిలో ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్‌ఎన్‌జీలోనూ 20 శాతం ఇక్కడి నుంచే సరఫరా జరుగుతోంది. ఈ నౌకలన్నీ హర్మూజ్‌ జలసంధి నుంచే రాకపోకలు సాగించాలి. ఈ నేపథ్యంలో హర్మోజ్‌ జల సంధిని మూసివేస్తూ ఇరాన్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్‌లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -