నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు దగ్ధమై పలువురు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన, ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాద వివరాలను అధికారులు దుబాయ్లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రాణ నష్టం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.



