నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ, సోమవారం రంగం వేడుకలు.. అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మహంకాళి బోనాలకు ఉదయం 4.10 గంటలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అధికారులు తెలిపారు. సోమవారం రంగంతో పాటు ఆదివారం రాత్రి, సోమవారం అమ్మవారి ఫలహారబండ్ల ఊరేగింపు ఉంటుంది.
అమ్మవారి జాతరకు వచ్చే భక్తుల కోసం నగరం నలు మూలల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే దేవాలయం సమీప ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
ప్రధానంగా జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ విభాగం నుంచి సుమారు 2500 వందల మంది. వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్టు డీసీసీ సాధన రష్మీ తెలిపారు. దేవాలయానికి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనార్థం బయటకు వెళ్లేందుకు రెండు ద్వారాలను ఏర్పాటు చేశారు. మొత్తం 70 సీసీ కెమెరాల నడుమ 2500 మంది పోలీసు బందోబస్తుతో జాతర ప్రశాంతంగా జరిగేలా ఏర్పాటు చేసినట్లు డీసీపీ రశ్మీపెరుమాళ్ తెలిపారు.