నవతెలంగాణ – హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పరిస్థితి అవసరమైతే లక్షలాది మంది భారతీయుల భద్రత, సంక్షేమంతో పాటు వారి సురక్షిత తరలింపు కోసం చేయాల్సిన ప్రత్యేక కార్యక్రమాల అవసరాన్ని లేఖలో ఉద్ఘాటించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారిలో అగ్రభాగం కేరళా వాసులే ఉన్న సంగతి తెలిసిందే. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడి తర్వాత, గల్ఫ ప్రాంతంలో యుద్ధ నీడలు అలముకుంటున్నాయని, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. భద్రతా పరిస్థితి మరింత దిగజారితే, యుద్ధ ప్రాంతాల నుండి భారతీయులను తరలించడానికి కార్యాచరణ ప్రణాళిక అవసరమని పునరుద్ఘాటించారు. విదేశాల్లో పనిచేస్తున్న పౌరులు, వారి బంధువుల గురించి సమాచారం కోసం కేరళ ప్రభుత్వం హెల్ప్లైన్లను ప్రారంభించిందని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) ప్రకారం.. ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటినుండి ప్రవాస కేరళీయుల వ్యవహారాల విభాగం (ఎన్ఒఆర్కెఎ) ఏర్పాటు చేసిన హెల్ప్లైన్లు 381 కాల్స్ను ప్రాసెస్ చేశాయి. ఇప్పటి వరకు, 137మంది ప్రవాసభారతీయులు, గల్ఫ్లో పనిచేస్తున్న 244మంది వ్యక్తులు 24 గంటల ఎన్ఒఆర్కెఎ హెల్ప్డెస్స్ సేవలను వినియోగించుకున్నారు. వీటిలో అత్యధికమైన ఫోన్కాల్స్ విమానాల రద్దు, భద్రతా సూచలనకు సంబంధించినవని సిఎంఒ కార్యాలయం తెలిపింది. భారత ప్రభుత్వం (జిఒఐ) గల్ఫ్ ప్రాంతం నుండి తరలించేందుకు అవసరమైన విమానాలను ఏర్పాటు చేయనుందా అని అడిగినట్లు సిఎంఒ కార్యాలయం తెలిపింది. గల్ఫ్లో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి పరిస్థితిపై ప్రవాస కేరళీయులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



