Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీ పెట్టుబడితో వస్తున్న కాగ్నిజెంట్

భారీ పెట్టుబడితో వస్తున్న కాగ్నిజెంట్

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్, విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పరిణామం రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో కాగ్నిజెంట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.1,582 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.


కాగ్నిజెంట్ సంస్థ, తమ క్యాంపస్ ఏర్పాటు కోసం విశాఖపట్నంలోని కాపులుప్పాడ ప్రాంతంలో 21.31 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా, ఈ భూమిని ఎకరా కేవలం 99 పైసల నామమాత్రపు ధరకే కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ క్యాంపస్‌ను నిర్మించి, కార్యకలాపాలు సాగించడానికి సిద్ధంగా ఉన్నామని కాగ్నిజెంట్ ప్రతినిధులు మంత్రి లోకేశ్ కు తెలియజేశారు. ఈ పెట్టుబడి ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, విశాఖపట్నం ఐటీ రంగంలో మరింత అభివృద్ధి సాధించడమే కాకుండా, స్థానికంగా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు సకాలంలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -