– వర్షాల నేపథ్యంలో నేడూ ఆరెంజ్ హెచ్చరిక
– వచ్చే ఐదు రోజులపాటు పలు జిల్లాలకు వర్ష సూచన
– రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
– చురుగ్గా ముందుకు సాగుతున్న నైరుతి రుతుపవనాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. అదే సమయంలో వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు, చిరుజల్లులు పడే సూచనలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గురువారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు వందకుపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా మోయిన్పేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. వికారాబాద్, హైదరాబాద్, మహబూబాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, మెదక్, నారాయణపేట్, హన్మకొండ, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
చల్లని కబురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES