Sunday, June 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపదండి ముందుకు పడండి త్రోసుకు!

పదండి ముందుకు పడండి త్రోసుకు!

- Advertisement -

నేడు మహాకవి శ్రీశ్రీ వర్ధంతి కాబట్టి ఆయన్ని మననం చేసుకుందాం. ”పదండి ముందుకు/ పడండి త్రోసుకు!/ పోదాం పోదాం పైపైకి” అని మహాకవి చెప్పాడు. ఒక ప్రశ్న వస్తుందిక్కడ అలా ముందుముందుకు, త్రోసుకుంటూ ఎక్కడికి పోవాలి అని. అందుకే ఎక్కడికి పోవాలో ఆ పంక్తులకంటే ముందే చెప్పాడు ”మరో ప్రపంచం/ మరో ప్రపంచం/ మరో ప్రపంచం పిలిచింది!” అని. అందుకే పడుతూ లేస్తూ, తోసుకుంటూ అందరిదైన ఆ మరో ప్రపంచం సాధించమన్నాడు. పైకి పోవడానికి అంటే పైలోకానికి పోవడానికి త్రోసుకుంటూ పొమ్మనలేదాయన. అలాగే యువత అంటే మహాకవికి ప్రాణం అందుకే ”కొంతమంది యువకులు ముందు యుగం దూతలు” అన్నాడు. దాంతో పాటే ”కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు” అనీ అన్నాడు ఎందుకంటే వీళ్లు సమాజాన్ని ఏమాత్రం పట్టించుకోరు కాబట్టి.
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈమధ్యే ఒక సినిమా దగ్గర, పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కప్పు కొట్టుకొచ్చిన ఒక క్రికెట్‌ జట్టు సంబురాలు చేసుకుంటుంటే అక్కడ తొక్కిసలాట జరిగి కొందరి ప్రాణాలు పోవడం జరిగింది. మహాకవి చెప్పిన మరో ప్రపంచానికి ఎలా పోవాలో వీళ్లకి ఎవరు చెబుతారు? పిచ్చి ముదిరి, స్నేహితులతో కలిసి తమ క్రికెట్‌ హీరోలు, సినిమా హీరోలను చూడడానికి పోయి శవంగా ఇంటికొస్తే వాళ్ల తలిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఆ హీరోలను చూడడం ముఖ్యమా లేక వాళ్లు ఆ స్థితికి ఎంత కష్టపడి వచ్చారో అలా రావడం మానేసి వాళ్లతో సెల్ఫీ తీసుకోవాలని, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని, ఆ కోలాహలంలో పాల్గొనాలని ఎందుకనుకుంటున్నారు? అంతకంటే ముఖ్యమైన తమ చదువులు, తమ ఇంట్లో పనులు చూసుకోవాలన్న కోర్కె ఉండొద్దా? అవన్నీ చేసుకునేవాళ్లు కూడా ఒకసారి చూసొద్దామని పోయి తిరిగి రాకుండా ఉండొచ్చు కూడా ఎందుకంటే అందరినీ నిందించలేము.
చనిపోయిన మనుషుల్ని బతికించడానికి ఇదేమీ సినిమా కాదు, జీవితం. ఒక మనిషితో ఇంట్లో వాళ్లకు రకకాల బంధాలుంటాయి. తోపులాటలో చనిపోయిన వారికి ఏ పదిలక్షలో, ఇరవై లక్షలో పరిహారం కింద ఇస్తే సరిపోతుందా అంటే పోయిన మనిషిని వెనక్కు తీసుకురావడం జరుగుతుందా? మళ్లీ సినిమాలు విడుదలవుతాయి, హిట్‌ అవుతాయి, డబ్బులు రాబట్టుకుంటాయి. క్రికెట్‌ మ్యాచులూ అంతే మళ్లీ జరుగుతాయి, సిక్సర్లూ, ఫోర్లు బాదుతారు, వందల పరుగులు చేస్తారు వరదలా, వికెట్లు కూడా తీస్తారు. క్రికెట్లో అవుట్‌ అయినవారిని మళ్ళీ ఆడిస్తారా? లేదు కదా. అలాగే నిజ జీవితంలో ప్రాణం పోగొట్టుకున్నవాళ్లు తిరిగి బతకడం జరగదు గాక జరగదు. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈతకోసం పోయి ప్రాణాలు పోగొట్టుకునేవారిని, ప్రమాదాల్లో అసువులు బాసేవారినీ కూడా చూస్తున్నాం.
ఇంగ్లీషువారిపై బెర్నార్డ్‌ షా ఎప్పుడూ బాణాలు సంధించేవాడు. ఆయన క్రికెట్‌ పై వేసిన చురక చాలామందికి తెలుసు. పనిలేనివారు కనిపెట్టిన ఆటగా దాన్ని జమకట్టాడు. పదకొండుమంది మూర్ఖులు ఆడుతూవుంటే పదకొండువేల మంది మూర్ఖులు చూస్తారంటాడు. ఆ ఆట ఇప్పుడు విస్తరించి దేశదేశాలు పాకి వెలిగిపోతోంది. అందులో డబ్బుపెట్టేవారు పెరిగిపోయి కౌంటీలనుండి ఇప్పుడు ఐపియల్‌ మ్యాచులొచ్చి క్రికెట్‌ సంతలో ఆటగాళ్లను కొంటున్నారు. షా చెప్పిన ఆడేవాళ్లూ, చూసేవారూ ఎంతింతై అన్నట్టు పెరిగిపోయి వాళ్లలోనే ఈ ఆటకు పెట్టుబడిపెట్టేవాళ్లూ, పందాలు కట్టేవాళ్లూ, ఊరకనే చూసేవాళ్లు, ప్రకటన కర్తలు, వ్యాపారాలూ అన్నీ కలగలసి పోయాయి. ఇప్పుడు ఏ.ఐ.ని ఈ పరిస్థితుల్లో షావారు ఏమనేవారని అడిగితే ఏమని సమాధానమొస్తుందో మరి? బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో జట్టును చూడడానికొచ్చినవారిలో పదకొండుమంది అమాయకులు చనిపోవడం యాదృచ్చికం.
ఎవరి హీరోలు వారికుంటారు.ఉండడమే కాదు అభిమానుల మధ్య గొడవలూ ఉంటాయి. ఇది ఇప్పటిది కాదు సీనియర్‌ ఎంటీయార్‌ ఏయెన్నార్‌ కాలం నుండీ ఉంది. తరువాత వచ్చిన హీరోలు అందరికీ తెలుసు. సినిమా విడదలయ్యిందంటే ఇక సందడే సందడి. పద్ధతులు మారిండొచ్చు కాని పిచ్చి మారలేదు. హీరోల బాబీ కాలర్లు, అడవిరాముడు కాలర్లు, బెల్ల్‌బాటాలు, స్టెప్‌ కటింగులు అప్పుడైతే ఇప్పుడు టాట్టూలు, విచిత్ర కటింగులు, చినిగిపోయిన ప్యాంట్లు, కూల్‌ డ్రింకుల రాజ్యం చూస్తాం. పురుగు మందులు కలిసిన శీతల పానీయాలు తాగమని హీరో ఒక వీరోచిత చర్య చేసేసినాక చెబుతాడు. కింద తెరమీద కనిపించీ కనిపించక ఇది ప్రత్యేకంగా శిక్షణ పొందినవారి ఆధ్వర్యంలో చేసేది అని ప్రకటన వస్తుంది. సిగరెట్టు, మద్యం ప్రకటనలాగే దీన్నీ ఎవ్వరు చూడరు. పాత హీరోలు ప్రకటనల్లో సంపాదించకున్నా వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు ఉచిత షోలలో పాల్గొని నిధులు సేకరించి పెట్టేవాళ్లు. ఇప్పటివాళ్లు కూడా ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు సమయానికి సహాయం అందిస్తూనే ఉంటారు. కాబట్టి హీరోలు తెరమీద చేసే కార్యాలు కాకుండా నిజజీవితంలో ఏవైనా మంచిపనులు చేస్తే వాటిని అనుకరించాలి యువత.
అంతా యువతనే అంటారు, కొంచెం ముందుకు పోయి వాళ్ల తలిదండ్రులనంటారు తప్ప వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న విషయాలమీద సమాజం, ప్రభుత్వాలు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి కదా మరి వారిని అనరెందుకని ఏ కొద్దిమందో అడగొచ్చు. ఇది నిజం. ఎవరికి వారు ఎప్పటికప్పుడు తప్పించుకొని వాళ్ల ఎన్నికల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటే వీళ్లని ఎందుకు పట్టించుకుంటారు పట్టించుకోకపోగా వీళ్లను అవసరానికి వాడుకుంటారని ఇంకో పెద్దాయన ఉసూరుమనొచ్చు. నావరకు నాకు ఇంటరులో చేరినప్పుడు మా నాన్న సైకిలు కొనిచ్చాడని, అదే వయస్సున్న తమ పిల్లలకు పెద్ద పెద్ద బైకులు కొనిస్తున్నారని ఇంక పిల్లలు ఎలా బాగుపడతారండి అని ఓ మధ్య తరగతి మానవుడనొచ్చు.
మారే కాలంప్రకారం మనమూ మారాలండి ఇది స్పీడు యుగం అని సాఫ్టువేరు పిల్లలున్న తండ్రి కారు డోరేసుకుంటూ అనొచ్చు. అందుకే వేటిలో ముందుగా ఉండాలో, ఏ విషయాల కోసం పడుతూ లేస్తూ పోవాలో యువతకు సరైన మార్గదర్శకం కావాలి. మహాకవికి జోహార్లర్పిస్తూ…… ఆయన పాత్రను ఎవరైనా తీసుకొని మనకు మరో ప్రపంచం తెస్తారని ఆశిస్తూ….
– జంధ్యాల రఘుబాబు, 9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -