నవతెలంగాణ-ఆర్మూర్ : ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా జిల్లా పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ వారు ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఎలాంటి సందర్భంలోనూ ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ రాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్ టీజింగ్ మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుండి బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడిన యజమానులపై కూడా కేసులు నమోదు అవు తాయని గుర్తుంచుకోవాలని సూచించారు.
పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొనగా ఈ కార్యక్రమంలో దాదాపు 45 ఇండ్లు మరియు సరైన ధ్రువపత్రాలు లభించని 48 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు,1కార్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి సత్యనారాయణ తెలిపారు. ప్రింట్ పరికరం ద్వారా 35 మందిని గుర్తించినామని, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ మరియు మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు 15, 2 ఆటోలు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో, స్పెషల్ పార్టీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



