Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహాఫ్‌ టైప్‌ పామాయిల్‌ చెట్లకు పరిహారం ఇవ్వాలి

హాఫ్‌ టైప్‌ పామాయిల్‌ చెట్లకు పరిహారం ఇవ్వాలి

- Advertisement -

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ డిమాండ్‌
– పామాయిల్‌ ఫ్యాక్టరీలోకి అనుమతి నిరాకరణ
– ప్రభుత్వ రంగ సంస్థలో నిరంకుశత్వమా?
– ఫ్యాక్టరీలో అవకతవకలు రైతులకు తెలుస్తాయని భయంతోనేనా?
నవతెలంగాణ-దమ్మపేట

హాఫ్‌ టైపు పామాయిల్‌ చెట్లకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ డిమాండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట గ్రామంలో ఉన్న పామాయిల్‌ ఫ్యాక్టరీ సందర్శనకు మంగళవారం వచ్చిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర బృందానికి తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ యాజమాన్యం అనుమతి నికాకరించింది. దాంతో రాష్ట్ర బృందం ఫ్యాక్టరీ గేటు ఎదుట తెలిపారు. అనంతరం సాగర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తమ బృందం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లోని నకిలీ, హాఫ్‌టైప్‌ బాధిత రైతుల పామాయిల్‌ తోటలను పరిశీలించిందని తెలిపారు. పామాయిల్‌ బాధిత రైతుల బాధలు వర్ణణాతీతమన్నారు. పామాయిల్‌ మొక్కలు నాటుకున్న మూడేండ్ల తరువాత ఫలసాయం చేతికందుతున్న ప్రణాళికతో సాగుచేసిన రైతుల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల గోడును కనీసం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యాన అధికారులు, ప్రభుత్వం వినటానికి, చూడటానికి కూడా ఇష్టపడటం లేదన్నారు. బాధిత రైతులను శత్రువులుగా చూస్తున్నారని, అధికారులు చేసిన తప్పిదాలను రైతులపై రుద్ది అవినీతిపరులను కాపాడాలని ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శాస్త్రవేత్తలతో కూడిన విచారణ కమిటీ వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశానికి వెన్నుముక రైతన్న విషయం మరిచి వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంలో కీలకమైన పామాయిల్‌ రైతును నిర్లక్ష్యం చేస్తే లక్ష్యం ఎలా చేరతారని ప్రశ్నించారు.రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య మాట్లాడుతూ.. అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీని సందర్శించడానికి తమ బృందానికి ఆయిల్‌ఫెడ్‌ జీఎం సుధాకర్‌ రెడ్డి అనుమతి నిరాకరించారని, ఫ్యాక్టరీలో జరుగుతున్న అవకతవకలు రైతులకు తెలుస్తాయన్న భయంతోనే తమను అనుమతించలేదా అని ప్రశ్నించారు. విజయవంతమైన అధిక ఆయిల్‌ రికవరీ వస్తున్న హారిజాంటల్‌ స్టరిలైజర్‌ టెక్నాలజీని వదిలి.. తక్కువ ఆయిల్‌ రికవరీ, ఎక్కువ ఎఫ్‌ఎఫ్‌ఏ వచ్చే వర్టికల్‌ స్టరిలైజర్‌ టెక్నాలజీకి రూ.30 కోట్లు ఖర్చు పెట్టిన విషయం భయటపడుతుందని భయంతోనే అనుమతించలేదా అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థను యాజమాన్యం ఒక ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా, స్వంత యాజమాన్య సంస్థగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. తమ సంఘం రైతుల పక్షాన ఉండి సమస్యలను ఎత్తి చూపుతూ పరిష్కారానికి పోరాటం సాగిస్తుందన్నారు. ఈ పర్యటనలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్‌, బొంతు రాంబాబు, యలమంచిలి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, నాయకులు మోరంపూడి పాండు, రావుల రాజబాబు, మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డా లక్ష్మినారాయణ, బ్రహ్మయ్య, మురహరి రఘు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -