నవతెలంగాణ-హైదరాబాద్: అధిక ద్రవ్యోల్భణంతో సతమతమవుతున్న పాక్ ప్రజలు.. భారీగా పెరిగిన చమురు ధరలను వ్యతిరేకిస్తూ ఆందోళన బాటపట్టారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పాక్ వ్యాప్తంగా కరాచీ, సింధ్,హైదరాబాద్, సుక్కుర్, జాకబ్బాద్ ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. ప్రజల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో పీటీఐ శ్రేణులు భారీగా నిరసనల్లో పాల్గొన్నారు.
అవామీ తెహ్రీక్ తీర్ చౌక్ నుండి ఘంటా ఘర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి, అనంతరం ధర్నా ప్రదర్శన చేపట్టింది. కరాచీలో నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (NTUF), హోమ్-బేస్డ్ ఉమెన్ వర్కర్స్ ఫెడరేషన్ (HBWWF) సహా పలు కార్మిక సంఘాలు సంయుక్తంగా నిరసన చేపట్టాయి. జాకబాబాద్లో ఆమ్ ఇన్సాన్ తెహ్రీక్ పట్రోల్ రేట్ల పెంపును నిరసిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారని ఆ దేశ డాన్ పత్రిక కథనాలు వెలువరించింది.
కాగా, ఇటీవల ఆ దేశ ప్రభుత్వం ఇంధన కొరతతో విపరీతంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. లీటర్ చమురు దాదాపు ఆ దేశ కరెన్సీలో 500 పలుకుతుంది.



