లేదంటే కాంగ్రెస్ నేతలకు సందు దొరుకుద్ది
కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన
రాహుల్ లీడర్ కాదు..రీడర్
రైతులను మోసగించారు
రోత కూతలు కూసే సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి :
బీఆర్ఎస్ సర్పంచుల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-జనగామ
ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉండటం సహజమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇది సర్వసాధారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ఆయన విలేకరులతో పరోక్షంగా స్పందిం చారు. గొడవలు జరిగినప్పుడు అలుగుడు, గులుగుడు ఉంటాయని, సర్దుకుపోవాలని.. లేదంటే కాంగ్రెస్ నేతలకు సందు దొరుకుద్దని ఆయన వ్యాఖ్యానించారు. జనగామ జిల్లాలో మంగళవారం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమాన్ని జనగామలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు జనగామలో రోడ్ షో నిర్వహిం చారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్ అని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్గాంధీ మాటలు విని ప్రతి నిరుద్యోగి విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను మరిచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో రోత కూతలు కూస్తున్నారని విమర్శించారు.
ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే మొఖం లేని, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇవ్వలేని సీఎం రేవంత్ రెడ్డి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. జనగామ ర్యాలీ చూస్తే కేసీఆర్.. మరోసారి ముఖ్యమంత్రి అయ్యారనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా, ఒత్తిడులకు గురిచేసినా పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ధన్యవాదాలు అని తెలిపారు. గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ప్రేమలతా రెడ్డి, పోకల జమున, నాయకులు సిద్ధి లింగం, బండ పద్మ, మేకల కళింగ రాజు తదితరులు పాల్గొన్నారు.
గొడవలు సహజం..సర్దుకుపోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



