నవతెలంగాణ- దుబ్బాక : అన్నదాతలకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇది రైతు ప్రభుత్వమని అన్నదాతలకు చెప్పాలని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతన ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఇంచార్జ్ పూజల హరికృష్ణ పలువురు హాజరైనారు. ఆత్మ కమిటీ చైర్మన్ గా తొగుట మండలానికి చెందిన గాంధారి నరేందర్ రెడ్డిని, డైరెక్టర్లుగా మరో 24 మందిని దుబ్బాక ఏడీఏ మల్లయ్య, ఏవో ప్రవీణ్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలక వర్గానికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆత్మ కమిటీ పని చేయాలన్నారు. అన్నదాతలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటూ.. వారి సమస్యల్ని పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ మహిళాధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు కొంగర రవి, అనంతుల శ్రీనివాస్, ఆకుల భరత్, శ్రీరామ్ నరేందర్, పాతూరి వెంకటస్వామి గౌడ్, మంద శ్రీనివాస్, యు.రాజిరెడ్డి, పలువురు పాల్గొన్నారు.