నవతెలంగాణ-హైదరాబాద్: మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపు లక్ష్యంగా, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన, ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో.. పోటీలో ఉన్న అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా, ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు… హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పాల్గొన్నారు.
ఈ సమావేశం సందర్భంగా…పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి, అధినేత కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధికార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత కేసీఆర్ సూచించారు.