– రైతుల్ని వెంటనే విడుదల చేయాలి
– ప్రయివేటు రంగానికి విద్యను అప్పగించే విధానాలు మానుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ, భూభారతిలో తప్పిదాలను ప్రశ్నించిన రైతులను అవమానకరంగా చూస్తోందని మండిపడ్డారు. త్వరలో రైతుల నుంచి రేవంత్ సర్కార్ గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడు రోజులపాటు ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సూర్జీత్ భవన్లో నిర్వహించిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా జాన్వెస్లీ మీడియాతో మాట్లాడుతూ పెద్ద ధన్వాడాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని నిరసన తెలుపుతున్న రైతులను అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ఇందులో భాగంగా 60 మంది రైతులపై కేసులు పెట్టారని, 12 మందిని రిమాండ్కు తరలించారని చెప్పారు. ఈ చర్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అరెస్టు చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. నిర్మల్లోనూ భూభారతిపై తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన రైతును అవమానకరంగా నెట్టివేశారన్నారు. ఇలాంటి ఘటనలపై త్వరలో రైతాంగం కూడా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.
విద్యను వ్యాపారంగా మార్చడం సరికాదు..
ప్రభుత్వ రంగం నుంచి విద్యను దూరం చేసి, ప్రయివేటు రంగానికి అప్పగించి విద్యను వ్యాపారంగా మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతం, ఆదివాసీ ఏరియాల్లో పాఠశాలలు మూతపడుతోన్న పరిస్థితి ఉందన్నారు. 12 గురుకుల పాఠశాలలనూ ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల సమాజంలో అట్టడుగున ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాలకు విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే పాఠశాలలకు సరైన నిధులు కేటాయించాలని, టీచర్లు, ఇతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడులు చేసే పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్న కేంద్రం… దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఆపరేషన్ కగార్ ఆపాలని, శాంతి చర్చలకు పిలవాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.