నవతెలంగాణ-హైదరాబాద్: స్వచ్చ్ నగరం పేరుపొందిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో మరోసారి కలుషిత తాగునీటి కారణంగా 24 మంది అస్వస్థత చెందారు. పిల్లలతో సహా సుమారు 24 మంది అనారోగ్యం పాలయ్యారు. కామెర్ల బారిన పడ్డారు.
గురువారం రాత్రి పట్టీ బజార్, చందర్ మార్గ్ ప్రాంతాల్లో కామెర్ల కేసులు వెలుగులోకి వచ్చాయి. పిల్లలతో సహా పలువురు అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోతీ మహల్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. స్కూల్ పిల్లలు అస్వస్థత చెందడంతో తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ముఖ్యమైన పరీక్షలు రాయలేకపోయారు. 12వ తరగతి చదువుతున్న అలేనా అనారోగ్యం కారణంగా ప్రీ బోర్డు పరీక్షలకు హాజరుకాలేకపోయింది.
ఇండోర్ జిల్లా కలెక్టర్ శివమ్ వర్మ గురువారం రాత్రి మ్హౌ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తాగు నీరు కలుషితమైనట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఆరోగ్య అధికారులు మ్హౌ ప్రాంతానికి చేరుకున్నారు. ఇండోర్ నుంచి కూడా ఒక వైద్య బృందం తరలివచ్చింది. స్థానికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.



