Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలులీగ్‌ మ్యాచ్‌ సెలక్ట్‌ కమిటీని కొనసాగించండి

లీగ్‌ మ్యాచ్‌ సెలక్ట్‌ కమిటీని కొనసాగించండి

- Advertisement -

– హెచ్‌సీఏకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లోని క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ, లీగ్‌ మ్యాచ్‌ల పర్యవేక్షణ కమిటీలను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలోని సింగిల్‌ మెంబర్‌ కమిటీ నియమించిన క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీలు, లీగ్‌ మ్యాచ్‌ల పర్యవేక్షణకు హైకోర్టు ఏర్పాటు చేసిన హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ నవీన్‌రావు సారధ్యంలోని సూపర్‌వైజరీ కమిటీలను కొనసాగించాలని చెప్పింది. తాము తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ కమిటీలను కొనసాగించాలని హెచ్‌సీఏను ఆదేశించింది. హెచ్‌సీఏ జనరల్‌బాడీ మీటింగ్‌ (ఏజీఎం)లో నిర్ణయాలు తీసుకునే వరకు ఆ కమిటీలను కొనసాగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని జై హనుమాన్‌ క్లబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి గురువారం మధ్యంతర ఆదేశాలిచ్చారు. 2025-26 కాలంలో నిర్వహించబోయే లీగ్‌ మ్యాచ్‌లను హెచ్‌సీఏ నిబంధనలు, సూపర్‌వైజరీ కమిటీ నివేదిక మేరకు వ్యవహరించేలా హెచ్‌సీఏను ఆదేశించాలని పిటిషనర్‌ న్యాయవాది వాదించారు. సెలక్షన్‌ కమిటీలను, సూపర్‌వైజరీ కమిటీలను తొలగిస్తే హెచ్‌సీఏ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోడానికి వీలుంటుందన్నారు. ఏజీఎంలో నిర్ణయాలు తీసుకునే వరకు ఆ కమిటీలను కొనసాగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.. వాదనల తర్వాత హైకోర్టు, హెచ్‌సీఏ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ కమిటీలను కొనసాగించాలని హెచ్‌సీఏను ఆదేశించింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.
బతుకమ్మ కుంట పనులు చేసేందుకు హైడ్రాకు అనుమతి
ముంపు నివారణ పనులు కొనసాగించొచ్చు
హైకోర్టు ఉత్తర్వులు
వర్షాకాలంలో వరద ముంపునకు గురికాకుండా బతుకమ్మకుంట పునరుద్ధరణలో భాగంగా అవసరమైన పనులను చేయడానికి హైడ్రాకు హైకోర్టు అనుమతినిచ్చింది. బతుకమ్మకుంట స్థలానికి సంబంధించి ప్రయివేటు వ్యక్తులు హక్కుల వివాదంపై సివిల్‌ కోర్టులో ఇంజంక్షన్‌ పిటిషన్‌ తేలేదాకా యథాతథస్థితిని కొనసాగించాలన్న గత ఉత్తర్వులను సవరించింది. హైదరాబాద్‌ బాగ్‌అంబర్‌పేట సర్వే నెం.563/1లోని 7 ఎకరాలకు సంబంధించిన స్థలంపై మే ఐదున ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైడ్రా వేసిన వ్యాజ్యంపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఇటీవల విచారించింది. హైడ్రా తరపు అడ్వకేట్‌ కె. పవన్‌కుమార్‌ వాదిస్తూ, బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఆక్రమణదారులు అక్రమంగా డంపింగ్‌ చేస్తూ చెరువును కబ్జా చేస్తున్నారన్నారు. ఎ.సుధాకర్‌రెడ్డి మరో ఆరుగురు బాగ్‌అంబర్‌పేటలోని ఏడెకరాల భూమిపై హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించగా సింగిల్‌ జడ్జి పిటిషన్‌ కొట్టివేశారన్నారు. తిరిగి అప్పీలు దాఖలు చేయగా హక్కులకు సంబంధించిన వివాదాలను హైకోర్టు తేల్చదనీ, సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలనీ, అవసరమైతే ఇంజంక్షన్‌ ఉత్తర్వులు తెచ్చుకోవాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై ప్రయివేటు వ్యక్తులు సివిల్‌ కోర్టులో సూట్‌ దాఖలు చేశారనీ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి ఇంజంక్షన్‌ దరఖాస్తు తేలేదాకా యథాతథస్థితి కొనసాగించాలంటూ మే ఏడున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రస్తుతం వర్షాకాలం వస్తోందనీ, ఇప్పుడు పనులు పూర్తిచేయకపోతే పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయనీ, మధ్యంతర ఉత్తర్వులను సవరించని పక్షంలో పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం స్టేటస్‌ కో కొనసాగించాలనీ, అయితే వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతాయన్న హైడ్రా వాదనను పరిగణనలోకి తీసుకుని ముంపు నివారణ పనులు చేపట్టడానికి అనుమతిస్తూ గత ఉత్తర్వులను సవరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -