– విద్యుత్ సంస్థల సీఎమ్డీలతో ఇంథనశాఖ కార్యదర్శి నవీన్మిట్టల్ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా, పంపిణీ వ్యవస్థల్ని సమన్వయం చేయాలని ఇంథనశాఖ కార్యదర్శి నవీన్మిట్టల్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్శాఖకు అత్యధిక ప్రాథాన్యత ఇస్తుందనీ, ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతనంగా ఇంథనశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన మంగళవారం విద్యుత్సౌధ, మింట్ కాంపౌండ్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. విద్యుత్సౌధలో తెలంగాణ ట్రాన్స్కో సీఎమ్డీ కృష్ణభాస్కర్తో కలిసి స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్తో పాటు పలు విభాగాలను సందర్శించారు. అనంతరం మింట్ కాంపౌండ్ లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఎమ్డీ ముషారఫ్ ఫరూఖీతో కలిసి డేటా సెంటర్తోపాటు ఇతర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎమ్డీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా – పంపిణీ వ్యవస్థల గురించి వివరించారు. ఏటా పది శాతం వృద్ధి నమోదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 నుంచి 20 శాతం డిమాండ్ వృద్ధి వివరాలను తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదయ్యిందనీ, దానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు ఐదేండ్ల ప్రణాళికలు రూపొందించి భవిష్యత్ అవసరాలకు తగినట్టు నూతన సబ్స్టేషన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ప్రాథాన్యతలకు అనుగుణంగా రాష్ట్రంలో అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయనీ, వాటన్నింటికీ విద్యుత్ అవసరాలు తప్పనిసరి అని ఈ సందర్భంగా నవీన్మిట్టల్ చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనీ, ఫిర్యాదులపై తక్షణం స్పందించి, పరిష్కారాలు చూపాలని ఆదేశించారు.
సరఫరా, పంపిణీని సమన్వయం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES