నవతెలంగాణ-హైదరాబాద్: జస్టిస్ యశ్వంత్ వర్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, అందుకు అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకోస్తామని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. న్యాయవ్యవస్థలో అవినీతిని తమ ప్రభుత్వం సహించదన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అవిశ్వాస తీర్మానంపై రాజకీయ చేయడం లేదని, ఈ విషయంలో తమ ప్రభుత్వం ఐక్య వైఖరి కలిగి ఉండాలని భావిస్తుంది. త్వరలోనే తాను అన్ని పార్టీల లీడర్లను కలుస్తానని తెలిపారు. అందుకు త్వరలోనే కార్యచరణ ప్రారంభిస్తానని జాతీయ మీడియాకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెల్లడించారు. ఇటీవలే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మ పనిచేస్తుండగా గత మార్చి 14న పెద్దఎత్తున నోట్ల కట్టలు ఆయన నివాసంలో బయటపడటం సంచలనమైంది. ఈ ఘటన అనంతరం మార్చి 28న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని సూచించింది. అనంతరం ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని కమిటీ జస్టిస్ వర్మను తప్పుపట్టింది. ఆయన చర్యలు అనుచితమని, కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన రాజీనామా చేయాలని జస్టిస్ ఖన్నా సూచించగా జస్టిస్ వర్మ నిరాకరించారు. దీంతో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.