నవతెలంగాణ – హైదరాబాద్ : తీవ్రమైన కులవేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ కుటుంబాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రతినిధి బృందం పరామర్శించింది. చండిఘడ్లో ఉన్న పూర్ణ కుమార్ నివాసానికి వెళ్లి ఆయన భార్య అమ్నీత్ పి. కుమార్, కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢసానుభూతి తెలియజేశారు.ఏడీజీపీ వై. పూర్ణ కుమార్ విషాద మరణం పట్ల ప్రతినిధి బృందం విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, పూరన్ మరణానికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రతినిధి బృందంలో పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు, హర్యానా రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ చంద్, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు ఇంద్రజిత్ సింగ్, న్యాయవాది రణధీర్ సత్తి, పంజాబ్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు రోషన్ లాల్ మోడ్గిల్ న్యాయవాది షహనాజ్ ఉన్నారు.
ఉన్నతాధికారుల కులవేధింపుల కారణంగా హర్యానా ఐపీఎస్ అధికారి వై.పూరన్ అక్టోబర్ 7న తన ఇంట్లో సర్వీస్ గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.తన మరణానికి కారణం డీజీపీ శత్రుజీత్ తో పాటు పలువురు ఉన్నతాధికారుల పేర్లలను సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.