నిమిషాల వ్యవధిలోనే భారీ వర్షం
రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత…
చెరువులను తలపించిన రహదారులు
హైదరాబాద్లో పొంగిన డ్రయినేజీలు..
లోతట్టు ప్రాంతాలు జలమయం
శివారు ప్రాంతాల్లో ముంచెత్తిన వాన..
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
మెదక్లో 17.65 సెంటీమీటర్ల వర్షపాతం
నవతెలంగాణ- సిటీబ్యూరో/ మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/గట్టుó
రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల చెరువులను తలపించాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాన ముంచెత్తింది. బంజారాహిల్స్, జూభీహిల్స్, షేక్పేట, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, శామీర్పేట, అంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కొద్దిసేపు పడినా భారీగా నమోదయ్యింది. రామోజీ ఫిల్మ్సిటీ ప్రాంతంలో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. హయత్నగర్-విజయవాడ రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు చేరి.. చెరువులను తలపించాయి. హయత్నగర్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనస్థలిపురంలో వర్షపు నీరు ఇండ్లల్లోకి చేరింది. హయత్నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరదనీరు చేరింది. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
మెదక్ జిల్లా అతలాకుతలం
మెదక్ పట్టణంలో అత్యధికంగా 17.5 సెం.మీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు గాంధీ నగర్, సాయి నగర్ కాలనీ, వెంకట్రావు నగర్ నీట మునిగాయి. మెదక్ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలోకి భారీగా వరద నీరు చేరడంతో విద్యార్థులను సిబ్బంది ఇంటికి పంపించారు. మెదక్- హైదరాబాద్ నేషనల్ హైవే చెరువును తలపిస్తున్నది. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అయిన విషయం విదితమే. పది మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం ఏరియల్ సర్వే చేశారు. ఏడుపాయల దేవాలయం 27 రోజులుగా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. గురువారమే దేవాలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఆ ఘటనలు మరువకముందే మెదక్ పట్టణాన్ని మళ్ళీ భారీ వర్షం ముంచెత్తింది. మెదక్తో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురవడంతో పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లవచ్చని రైతులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.
భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. చెరువులు నిండి అలుగు పారాయి. పలు గ్రామాల్లో వాగులు ఉధతంగా ప్రవహిస్తున్నాయి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. మాచర్ల గ్రామంలో దళితవాడలో ఉన్న పాఠశాల చుట్టూ మురుగు నీరు నిలుస్తుండడంతో దుర్వాసన వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలకు రావాలంటే చాలా భయమేస్తుందని, ఈ మురుగునీటితో పాటు వర్షపు నీరు పాఠశాలలోకి వచ్చి చేరుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మధ్యాహ్నం అన్నం తినాలంటే ఆ వాసనకి తినలేక తింటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి, తదితర ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడ్డాయి.
అప్రమత్తంగా ఉండండి
– ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇండ్లల్లో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.