– 30 కిలోల బ్యాగుపై రూ.1000 భారం
– రెండున్నర ఎకరాలకు ఒక బ్యాగు మాత్రమే
– విత్తనాల కోసం రైతుల బారులు
– సాగు విస్తీర్ణానికి సరిపడా అందని సీడ్స్ పచ్చిరొట్ట ఎరువుతో నేల ఆరోగ్యం, ఉత్పాదకత పెరుగుదల
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ముందస్తు వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగమయ్యారు. ఇప్పటికే మెట్ట పంటల సాగు కోసం వేసవి దుక్కులు దున్నిన రైతులు.. వరి సాగు చేసేందుకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జీలుగ, జనుము, పెసర విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ జీలుగ, తదితర విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రెండూ మూడ్రోజులుగా రైతులు విత్తనాల కోసం పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరో పక్క జీలుగ విత్తనాల ధరలు రెట్టింపు చేయడంతో రైతులపై బస్తాకు అదనంగా రూ.1000 భారం పడుతోంది. ధర పెంచడం వల్ల సబ్సిడీ ఇచ్చినా రైతులకు మేలు చేకూరని పరిస్థితి నెలకొంది.
30 కిలోల బస్తాపై రూ.1000 భారం
రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు ముందుగా రైతులు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జీలుగ విత్తనాలను పొలాల్లో చల్లుకుంటారు. మే నెల చివర్లోనే విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సగం మంది రైతులు జీలుగ విత్తనాల కోసం ఎగబడుతున్నారు. విత్తన సీజన్ కాగానే ధరలు పెరగడంతో రైతులపై మోయలేని భారం పడుతోంది. గతేడాది 30 కిలోల జీలుగ విత్తన బ్యాగును సబ్సిడీపై కేవలం రూ.1124కే రైతులకు అందించారు. ఈ సారి అదే బ్యాగు ధరను ప్రభుత్వం రూ.4275 పెంచింది. అందులో 50 శాతం సబ్సిడీపై రైతులకు రూ.2137కు అందిస్తుంది. 30 కిలోల జీలుగ విత్తన బ్యాగు కోసం గతేడాది కంటే ఈ సంవత్సరం అదనంగా రూ.1000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఎకరాలకు 15 కిలోల మేరకు జీలుగ విత్తనాల్ని చల్లుతుంటారు. ఆరు ఎకరాల వ్యవసాయం చేసే రైతుకు జీలుగ విత్తనాలపైనే రూ.3000 అదనపు భారం పడుతోంది. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగయ్యే వరి విస్తీర్ణంలో సగానికి లెక్కించినా 4 లక్షల ఎకరాలకు జీలుగ విత్తనాలు కావాలి. ఆ లెక్కన 2 లక్షల విత్తన బ్యాగుల్ని రైతులు కొనుగోలు చేసే అవకాశముంది. ఈ లెక్కన కోట్లాది రూపాయలు జీలుగ విత్తనాల కోసం అదనంగా రైతులు ఖర్చు చేయాల్సి వస్తుంది.
పచ్చిరొట్ట ఎరువుకు.. విత్తన కొరత
రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం, పర్యావరణ కాలుష్యం కారణంగా నేల ఆరోగ్యం క్షీణిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కల్తీ ఎరువులు, రసాయన ఎరువుల్ని విచ్చలవిడిగా వాడటం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా పంట దిగుబడులు కూడా తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట ఎరువుల కోసం జీలుగ, జనుము, పెసర వంటి విత్తనాలు పొలంలో చల్లుకుంటే రెండు రకాల లాభాలుంటాయని వ్వవసాయ అధికారులు సూచిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల భూసారం పరీక్షించబడటమే కాకుండా టన్నుల కొద్దీ జీవ పదార్ధం, నత్రజని నేలకు అందుతుంది. ఇంతటి ప్రయోజనాలున్నాయని తెలిసినప్పటికీ రైతులకు సాగు విస్తీర్ణం అవసరాల మేరకు విత్తనాలను అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.
వానా కాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకా శముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ముందస్తు వర్షాలు కురుస్తున్నందున భూ గర్భ జలాలు పెరగమే కాకుండా ప్రాజెక్టులు నిండే అవకాశముంది. సిద్దిపేట జిల్లాలో 3.79 లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 3.42 లక్షల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1.01 లక్ష ఎకరాల్లో వరి, ఇతర నీటి ఆధారిత పంటలు సాగయ్యే పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సుమారు 10 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరముంటుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల్లో లభ్యమవుతున్న విత్తనాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి.
విత్తనాల కోసం ఎగబడుతున్న రైతులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల 26 నుంచి జీలుగ విత్తనాల్ని పంపిణీ చేస్తున్నారు. మొదటి రోజు విత్తనాల పంపిణీ విషయం రైతులకు పెద్దగా తెలియలేదు. మరుసటి రోజు నుంచి రైతులు విత్తనాల కోసం పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది పీఎసీఎస్ కేంద్రం వద్ద రైతులు విత్తనాల కోసం ఎగబడాల్సి వచ్చింది. బస్తా చేతికొచ్చే వరకు గ్యారంటీ లేకపోవడంతో చిన్నపాటి యుద్దమే చేయాల్సి వస్తుంది. పుల్కల్, చౌటకూర్, ఆందోల్, హత్నూర, సదాశివపేట, మెదక్ జిల్లా రామాయంపేట, పాపన్నపేట, టేక్మాల్, మెదక్, కొల్చారం, చిలిపిచేడ్, నర్సాపూర్, నిజాంపేట, తూప్రాన్, మర్కుక్, గజ్వేల్, అక్కన్నపేట, చిన్నకోడూర్ వంటి ప్రాంతాల్లో జీలుగ విత్తనాల అరకొర రావడంతో రైతులకు సరిపడ లభించలేదు. గతంలో ఎకరా రెండెకరాలకు ఒక బ్యాగు విత్తనాలు ఇచ్చిన అధికారులు ఈ సారి పాసుబుక్కు ఒక్క బ్యాగు మాత్రమే ఇస్తున్నారు.
అవసరాలకు సరిపడా విత్తనాలు అందించాలి : గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువుల్ని వాడాలని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సూచిస్తుంది. శాస్త్రీయంగా జీలుగ, జనుము విత్తనాలు చల్లుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. పచ్చిరొట్ట ఎరువుల పట్ల రైతుల్లో అవగాహన పెరిగింది. సాగు అవసరాల మేరకు ప్రభుత్వం విత్తనాల్ని అందుబాటులో ఉంచాలి. పెంచిన ధరల్ని తగ్గించాలి. గతేడాది ఇచ్చిన ధరకే రైతులకు విత్తనాలివ్వాలి.