నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు.. వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు దెబ్బతిన్నాయి.
అయితే, వీరికి తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అక్టోబర్ 27 నుంచి 30వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.



