- నవతెలంగాణ-అశ్వారావుపేట: చదరంగం అంటేనే ఓ మోస్తరు సామాజిక,ఆర్ధిక స్థాయి కుటుంబ పిల్లలు ఆడే ఆటగా గుర్తింపు ఉంది. అలాంటి ఆటలో జాతీయ స్థాయికి ఎంపిక అవడం అరుదైన విషయమే. అశ్వారావుపేట కు చెందిన ఫొటో గ్రాఫర్ ఆంజనేయులు – రమాదేవి లది ఒక సాధారణ కుటుంబం.ఈ దంపతులకు చెందిన భవ్య శ్రీ లక్ష్మికి బాల్యం నుండి చదరంగం పై మక్కువ చూపడంతో ఇంట్లో తల్లిదండ్రులు,ఈ విద్యార్ధిని చదువుతున్న సత్తుపల్లి డీఏవీ స్కూల్ ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దీంతో విద్యార్ధిని చదరంగం లో రాణిస్తుంది. హైదరాబాదులోని సఫలీగూడ డీఏవీ స్కూల్ క్రీడా మైదానంలో డీఏవీ నేషనల్ స్పోర్ట్స్ శుక్రవారం నిర్వహించిన చదరంగం పోటీలలో అశ్వారావుపేట కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కేశిబోయిన భవ్య శ్రీలక్ష్మి రాష్ట్రస్థాయిలో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికయింది.
భవ్య శ్రీలక్ష్మీ మొదటిగా క్లస్టర్ వైజ్ చదరంగం క్రీడల్లో భాగంగా కొత్తగూడెంలో….. జరిగిన పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కు ఎంపిక అయింది.ఆ తదుపరి నేడు రాష్ట్రస్థాయిలో చెన్నై – ఆంధ్ర – తెలంగాణ – కర్ణాటక నుంచి పాల్గొన్న టీంలతో తో జరిగిన చదరంగం పోటీలలో తలపడి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయింది.
ఈ సందర్భంగా డీఏవీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ సాయి శ్రీ మాట్లాడుతూ.. చదరంగం పోటీలలో సత్తుపల్లి డీఏవీ నుండి నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు.రాష్ట్రస్థాయిలో ఆంధ్ర – తెలంగాణ – కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల నుండి 20 స్కూల్స్ పాల్గొనగా, సత్తుపల్లి డీఏవీ నుండి నేషనల్ స్థాయికి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో కేశిబోయిన భవ్య శ్రీ లక్ష్మి మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాలలో యు సంగ్వి, దైదీప్తి ఉన్నారని తెలిపారు. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అండర్ 17 విభాగం పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ బృందానికి కేశిబోయిన భవ్య శ్రీలక్ష్మి కెప్టెన్గా వ్యవహరిస్తారని ఆమె తెలిపారు. డీఏవీ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న పోటీలలో సర్టిఫికెట్ సాధించిన విద్యార్థులు ఒలింపిక్స్ హాకీ టీంలో మెజార్టీ విద్యార్థులు ఉన్నారని, ఈ సర్టిఫికెట్కు అంత ప్రాధాన్యత ఉంది అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.భవ్య శ్రీ లక్ష్మికి పట్టణ ప్రముఖులు,అధికారులు,బంధుమిత్రుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.