నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్లో ఈరోజు ఉదయం పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న పాఠశాల బస్సును ఒక డీసీఎం వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, జీడిమెట్ల నుండి విద్యార్థులతో నారపల్లి వైపు వెళ్తున్న పాఠశాల బస్సు యూటర్న్ తీసుకుంటుండగా, ఘట్కేసర్ వైపు నుండి అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దెబ్బకు స్కూల్ బస్సు అదుపుతప్పి హైదరాబాద్ వైపునకు తిరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



