– ఆరుగురు గిరిజనులు మృతి
– 8 మందికి గాయాలు, రిమ్స్లో చికిత్స
– క్షతగాత్రులను పరామర్శించిన సీపీఐ(ఎం) నాయకులు,
– మాజీ మంత్రి జోగు రామన్న
నవతెలంగాణ-నార్నూర్, బేల
ఆదిలాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడటంతో ఆరుగురు గిరిజనులు మృతిచెందారు. గాదిగూడ, బేల మండలాల్లో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నా యి..గాదిగూడ మండలం పిప్రి గ్రామంలో పొలంలో విత్తనాలు వేస్తున్న సమయంలో వర్షంతోపాటు పిడుగు పడటంతో సిడాం రాంబాయి(45), పెందూర్ మాధవరావు(34), పెందూర్ సంజన(18), మంగు భీంబాయి(26) చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉన్నారు. గాయపడిన హెచ్కె.విశ్వనాథ్, పెందూర్ కైలాస్, పెందూర్ షేకు, సిడాం శంకర్, మర్సుకోల అంజు, మర్సుకోల వైశాలి, మర్సుకోల సోము, గోడాం శంభును రిమ్స్కు తరలించారు. మృతదేహాలను కూడా రిమ్స్కు తీసుకెళ్లారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి ఆదివాసీ విద్యార్థి జిల్లా సంఘం అధ్యక్షులు పూసం సంతోష్ చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. బేల మండలం సాంగిడి గ్రామంలోనూ పిగుడుపడి గెడం నందిని(45) మృతిచెందింది. గాయపడిన గెడం సత్యవతిని రిమ్స్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇదే మండలం సోన్కాస్ గ్రామంలోనూ కోవ సునిత(38) కూడా పిడుగుపాటుకు బలైంది. రిమ్స్లో మృతదేహాలను మాజీ మంత్రి జోగు రామన్న, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, నాయకులు సందర్శించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లా డుతూ.. పిడుగుపాటుతో రైతులు చనిపోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఒకే రోజు ఆరుగురు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రౌతు మనోహర్, యూనిస్ అక్బాని, తన్వీర్, రాజేష్ ఉన్నారు. అలాగే, పిడుగులు పడి చనిపోయిన ఆదివాసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ప్రభుత్వాన్ని కోరారు. పిడుగు పాటుతో చనిపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన బాధితులకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిడుగుపాటుతో గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారి వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్.స్వామి, నాయకులు కొట్నాక్ సక్కు, భీంరావు ఉన్నారు.
ప్రాణం తీసిన పిడుగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES