నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే.ఈ దుర్ఘటనలో 15మంది చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. త్వరితగతిన కేసు ఛేదించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. కేసు విచారణలో NIA దర్యాప్తను వేగవంతం చేసింది. ఉగ్రవాద కుట్రలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి మరియు అరెస్టు చేయడానికి వివిధ రాష్ట్ర పోలీసు బలగాలతో సన్నిహిత సమన్వయంతో దర్యాప్తు బృందం పని చేస్తోంది. ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను NIA అరెస్టు చేసింది. వీరిలో వైద్య నిపుణులు డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షాహీన్ సయీద్, టెర్రర్ మాడ్యూల్లో కీలక పాత్ర పోషించారు.
కేసు దర్యాప్తులో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితులను పలు రోజులనుంచి పేలుళ్లకు సంబంధించి వివరాలను జాతీయ దర్యాప్తు బృందం సేకరిస్తోంది. ఈక్రమంలోనే ఇద్దరు నిందితుల కస్టడీ పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ నిందితుడు యాసిర్ అహ్మద్ దార్ను మరో పది రోజుల కస్టడీకి అనుమతిస్తూ, డాక్టర్ బిలాల్ నసీర్ మల్లాను మరో ఎనిమిది రోజుల పాటు విచారించేందుకు ఏజెన్సీని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



