శాంతి, సమభావం, సమిష్టి క్షేమమే ఆధునిక ప్రజాస్వామ్య యుగధర్మమని శ్రీశ్రీ పదేపదే వక్కాణించాడు. ప్రజాస్వామ్య పరిపాలనకు ఇదే గీటురాయిగా భావించాలని ఆ మహాకవి తీర్మానించాడు.
మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. 20వ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలను విశ్వమానవాళి చవి చూసింది. మొదటి ప్రపంచయుద్ధ కాలం 1914-19. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939-44. ఈ రెండు ప్రపంచయుద్ధాల్లో కోట్లాది మంది చనిపోయారు. మరికొన్ని కోట్లమంది క్షతగాత్రులయ్యారు. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్లోని హీరోషిమా, నాగసాకి ప్రజానీకంపై ఆమెరికా కురిపించిన ఆటంబాంబుల విషమ ఫలితాలను ఆ దేశం నేటికీ అనుభవిస్తూనే ఉన్నది.
అయినా కొందరు దేశాధి నేతలు (పాలకులు) ఇప్పటికీ కళ్లు తెరవక, చరిత్ర గుణపాఠాలు నేర్వక, ఆధిపత్య స్వార్థంతో, జాత్యాహంకారంతో, మతోన్మాదంతో యుద్ధాలకు తెగబడుతూనే ఉన్నారు. తానుపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఏకపక్షంగా యుద్ధ దాడులు చేస్తూ ఆయా దేశాలను లొంగదీసు కోవాలని చూస్తున్నారు. అక్కడి దేశవనరులు, సహజ సంపద, గనులు, చమురులను కొల్లగొట్టాలని పన్నాగాలు పన్ను తున్నారు. ఆ కారణంతో ఆ దేశ ప్రజలను నయాబానిసలుగా మార్చడం లేదా పొరుగుదేశాలకు కాందిశీకులుగా తరిమిగొట్టే నరరూప రాక్షసులుగా మారుతున్నారు.
వీరు ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువ నీయరు. కరడుగట్టిన అమానుషత్వమే వీరి నరనరాన జీర్ణించుకు పోయినట్టున్నది. పైపై రూపాలేమైనా కావచ్చుగానీ, కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు అంతిమంగా ఇవి సామ్రాజ్యవాద మార్కెట్ దోపిడీకై సాగే యుద్ధాలని మనం మరువకూడదు.
ఇజ్రాయిల్- పాలస్తీనా (గాజా)పై యుద్ధదాడి చేస్తూనే ఇప్పుడు తాజాగా మరల ఇరాన్తో యుద్ధపోరుకు తలబడింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయిల్ అతిదుర్మార్గంగా ఇరాన్లో చొరబడి యురేనియం శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తున్నది. అణుబాంబు తయారీకి ఇరాన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నదని, ఆ ముప్పునుండి తప్పిం చుకునేందునే తాము ముందస్తు దాడికి దిగామని ఇజ్రాయిల్ నేత నెతన్యాహు అంటున్నాడు. ఇరాన్ నేత ఖొమైనీ అంతమైతేనే యుద్ధానికి ముగింపు అని వాదిస్తున్నాడు.
‘ఖొమైనీని మేం ఇప్పుడే చంపం. ఆయన ఎక్కడ దాక్కున్నాడో ఆ జాడ మాకు తెలుసు. అసలే మాకు ఓపిక తక్కువ. త్వరగా భేషరతుగా ఇరాన్ లొంగిపోతే మంచిది’ అని ట్రంప్ తన వాచాల త్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంతే కాదు ఇరాన్ రాజధాని టెహ్రాన్ను తక్షణమే ప్రజలు ఖాళీ చేయాలని హుకుం జారీ చేస్తున్నాడు. గాజా మాదిరి ఇరాన్ను కూడా ధ్వంసం చేసి చేజిక్కుంచు కోవాలనేది ట్రంప్ కుట్రగా కనపడుతున్నది.
అయితే ఈ యుద్ధం ఎంత కాలం సాగుతుంది? ఎంత విధ్వంసం జరుగుతుంది? ఎన్ని ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా గాలిలో కలసిపోతాయి? ఈ యుద్ధం పశ్చిమాసియా అంతా వ్యాపించి, కడకు మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తుందా..? అనేదే యావత్ మానవాళి ముందున్న ప్రశ్న.
ట్రంప్ రెండో రాకడ అనంతరం యుద్ధజ్వాలలు ఎగిసేగిసి పడుతున్నాయి. తన జోక్యంతోనే శాంతి లభిస్తుంది అని ట్రంప్ ఎన్ని ప్రగల్బాలు పలికినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతం కాలేదు. గాజా సమూల ధ్వంసం వరకూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఆదేశ నేత నెతన్యాహూ ప్రకటిస్తునే ఉన్నాడు. ట్రంప్ కూడా తన టూరిజం, రిసార్టుల వ్యాపారం కోసం గాజా వాసులను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయమని బెదిరి స్తున్నాడు.ఐక్యరాజ్యసమితి శాంతి నియమాలు, అంతర్జాతీయ కోర్టు నిబంధనలను వీరిరువురూ అసలు లెక్కజేయటం లేదు.
భారత్- పాక్ మధ్య జరిగిన యుద్ధం తనవల్లే ఆగిందని ట్రంప్ ఒక పక్క చెప్తూనే మరో పక్క ఉగ్రవాద చర్యలకు ఊతం ఇస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయిల్ కాలుదువ్వడానికి కారకుడ య్యాడు. ట్రంప్ అమానుష, నీతి బాహ్య చర్యలకు వ్యతిరేకంగా, సొంత దేశం అమెరికాలోనే లక్షలాది మంది ప్రజలకు ‘నో-కెంగ్’ ఉద్యమం పేరిట రోడ్ల మీదకు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే మన భారత దేశం తొలి నుండి శాంతి కాముకదేశం. సత్యం – అహింసల ప్రాతిపదికపై వెలసిల్లిన గౌతమ బుద్ధుని త్రిరత్నాలు దేశగతిని మార్చాయంటే అతిశయోక్తి కాదు. బుద్ధం శరణం గచ్చామి! సంఘం శరణం గచ్చామి! ధర్మం శరణం గచ్చామి శాంతి ఫరిడవిల్లడానికి కారణభూతమవు తున్నాయి.
సంపూర్ణ వికాసం కోసం బౌద్ధం, శ్రమైక జీవనం కోసం సంఘం, పరస్పర శాంతి-సహకారం కోసం ధర్మం ప్రతి వ్యక్తికి అవసరం. ఈ మార్గంలోనే గ్రామాలు, నగరాలు, రాజ్యాలు, దేశాలు ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇదే ప్రాతిపదిక. ప్రజాస్వామ్యంలో చర్చలు ఉంటాయి. ఎదుటివారిని అర్థం చేసుకోవాలనే సంస్కారం ఉంటుంది. నాతో పాటు అందరూ సమానమే అన్ని స్పృహ ఉంటుంది. ఇచ్చిపుచ్చు కునే గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇలాంటి చోట ఆధిపత్యానికి అహం కారానికి తావే ఉండదు. ఉమ్మడి శ్రేయస్కరమే తప్ప రెండో మాటకు స్థానమే ఉండదు. ఇవన్నీ మన జీవన శైలిలో నిబిడీకృ తమై ఉన్నాయి. బౌద్ధాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించిన ఆశోకుని ధర్మచక్రాన్ని మనం మన జాతీయ పతాకంలో కేంద్ర స్థానంలో నిలుపు కున్నాము. చక్రంలోని 24 ఆకులు (రేఖలు) 24 గంటలకు సంకేతంగా నిరంతరం ధర్మపథంలో సాగాలని బోధిస్తున్నాయి.
రెండవ ప్రపంచయుద్ధానంతరం ప్రపంచశాంతి కోసం ప్రప్రథమంగా 1949 ఏప్రిల్లో పారిస్లోనూ, ప్రాగ్లోనూ మహాసభలు జరిగాయి. 72 దేశాల నుండి రెండు వేలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సమస్త దేశాల ప్రయోజనాలను రక్షించి సుస్థిర శాంతి స్థాపనే ప్రపంచ శాంతి సమితి లక్ష్యం అని ఉద్ఘాటించారు.
‘మానవాళికి నేడు శాంతి అత్యంత ముఖ్యమై నది. శాంతి సాధనలో మనమంతా, సహచరులం’ అని అప్పటి మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలిపారు. ‘మారణా యుధాలను మనం నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయడం ఉత్తమం’ అని జాన్.ఎఫ్. కెన్నడీ అదే సందర్భంలో అన్నారు. ఈ మాటలు చాలా విలువైనవి, ఆచరించదగ్గవి.
ఆ తర్వాత మన దేశం అలీన దేశాల కూటమి స్థాపనకు, సారథ్యానికి కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చనపుడు యావత్ దేశం రాజకీయా లకు అతీతంగా ఒక్కటిగా నిలిచింది. అలాగే ఇటీవల పహల్గాంలో ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా సాగిన ఆపరేషన్ సిందూర్ చర్యలకు దేశం ఒక్కటిగా మద్దతు తెలిపింది. విపక్షాలకు చెందిన శశిథరూర్, కనిమొళి, జాన్బిట్రాస్, అసదుద్దీన్ ఒవైసీ వంటి వారు విదేశీ వేదికలపై పాక్ ఉగ్రవాదాన్ని నిర్ద్వంద్వంగా ఎండగట్టారు. మన వైఖరి విస్పష్టంగా తెలిపారు. భారతీయుల శాంతి కాముకత విశ్వ వాప్తంగా మరోసారి వెల్లడైంది. ‘భిన్నత్వంలో ఏకత్వమే మా బలం’ అని భారత్ సగర్వంగా చాటగలిగింది.
అయితే యుద్ధోన్మాద, ఉగ్రవాద మూలాలు తెలుసుకుని చైతన్యంతో వ్యవహరించడం సర్వదా శ్రేయస్కరం. పాకిస్తాన్ ఉగ్రవాదానికి అమెరికా ఊతం ఇస్తున్నట్టు తెలుస్తూనే ఉన్నది. ఈ ఉగ్రవాదం మత పరిధిని దాటి అమెరికాకు లంగిపోతున్నది. అమెరికా కూడా స్వీయ ప్రయోజనానికి ఉగ్రవాదాన్ని వాడుకుంటున్నది. చాలా ఉగ్రవాద సంస్థల మూలాలు మతోన్మాద గర్భంలో పురుడు పోసుకుం టాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి పుట్టిన వికృత కవలపిల్లలే ముస్లిం మతోన్మాదం – హిందు మతోన్మాదం అన్నది చరిత్ర కారుల వర్ణన.
ద్విజాతి సిద్ధాంతాన్ని ఒకవైపు జిన్నా, మరోవైపు సావర్కర్ వంటి వారు బలపరచడంలో మన దేశం రెండు ముక్కలై లక్షలాదిమంది మృతదేహాల మధ్యన మనకు స్వాతంత్య్రం లభించింది. అనంతరం హిందూ-ముస్లిం భారు భారు అని పిలుపునిచ్చిన మహాత్మాగాంధీ కూడా హిందూ మతోన్మాది గాడ్సే చేతిలో హతమ్వడం జగద్విదితం. యుద్ధోన్మాదం, మతోన్మాదం, ఉగ్రవాద హింసోన్మాదం ఇవి ఏవైనా ప్రజల ప్రాణాలను చాలా సులభంగా బలికొనేవే. ఆధిపత్య అహంకార పడగనీడలో ఇవి నిత్యం బుసకొడుతూనే ఉంటాయి. దీనికి విరుగుడు సత్యాహింసలతో కూడిన నిజమైన ప్రజాస్వామ్య మార్గమే శరణ్యమని మరోసారి మననం చేసుకోక తప్పదు.
– కె.శాంతారావు, 9959745723
శాంతికి శరణ్యం ప్రజాస్వామ్యమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES