– డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– సచివాలయంలో మౌలిక సదుపాయాలు, మూలధన సబ్కమిటీ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పన్నేతర ఆదాయాన్ని పెంచడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని మౌలిక సదుపాయాలు, మూలధన సబ్ కమిటీ చైర్మెన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లోని సచి వాలయంలో సబ్ కమిటీ మంత్రి వర్గ ఉప సంఘం భేటీ జరిగింది. అందులో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పన్నేతర ఆదాయంతో పాటు కేంద్ర నిధులను కూడా సాధిం చుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుండా కొత్తగా రూ.33,600 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్, ఎక్సైజ్ ఆదాయాలు రాకుండా పోయాయని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కొత్త పథకాలను ప్రజలకు ఇస్తున్నట్టు వివరించారు. బడ్జెట్ నిధులు కొన్ని శాఖలకు అధికంగా, మరికొన్ని శాఖలకు అతి తక్కువ అందుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి అన్ని శాఖలకూ నిధులు సమానంగా పంచేలా చూడాలని సూచించారు. శాఖల మధ్య ఖర్చు అంతరాలను తగ్గించాలనీ, అన్నింటిని ఒకే స్థాయిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నియోజక వర్గాల్లో పెండింగ్లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. పబ్లిక్ ఇంట్రస్ట్, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా ప్రభుత్వం ఆలోచనల మేరకు అందరూ పని చేయాలని సూచించారు. రేషనలైజేషన్ మేరకు పనులను పూర్తి చేయాలనీ, స్పిల్ ఓవర్ వర్క్స్ కూడా ప్రయారిటీ మేరకు పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందుకెళ్తుందని చెప్పారు. రాబోయే పది రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పన్నేతర ఆదాయంపై దృష్టి సారించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES