Wednesday, June 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందిగొచ్చిన అమెరికా

దిగొచ్చిన అమెరికా

- Advertisement -

– కాల్పుల విరమణకై ఇజ్రాయిల్‌పై ఒత్తిడి
– ఖతార్‌, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ వ్యూహాత్మక దాడులు
– ‘విరమణ’ తర్వాతా ఇజ్రాయిల్‌ దుందుడుకు చర్యలు
– గట్టిగా బదులిచ్చిన ఇరాన్‌
– కాళ్ళబేరానికి వచ్చిన ట్రంప్‌
టెహరాన్‌:
పన్నెండు రోజులుగా పశ్చిమాసియాతో పాటు యావత్‌ ప్రపంచాన్ని వణికించిన ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారినట్టు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ ఎదురుదాడులతో బెంబేలెత్తిన అమెరికా కాల్పుల విరమణ పాటించాలని ఇరు దేశాలను కోరింది. పశ్చిమాసియాలోని ఖతార్‌, ఇరాక్‌లోని అమెరికన్‌ మిలటరీ స్థావరాలపై సోమవారం రాత్రి ఇరాన్‌ పరిమిత స్థాయిలో క్షిపణుల దాడికి దిగిన కొద్ది గంటల్లోనే ట్రంప్‌ ఈ కాల్పుల విరమణ ప్రకటన చేయడం గమనార్హం. తమ అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ ఈ క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే ట్రంప్‌ ఈ ప్రతిపాదన చేసిన తర్వాత కూడా ఇజ్రాయిల్‌ దాడుల్ని కొనసాగించింది. దీనితో ఇరాన్‌ మరోసారి ఇజ్రాయిల్‌లై మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. దీనితో అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయిల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనితో తప్పనిసరై ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ సమయంపై ట్రంప్‌ పక్షపాతధోరణితో కాలనిర్ణయం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇరాన్‌ కాల్పుల విరమణ అమలు చేయాలనీ, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ అమలు చేస్తుందని షరతులు పెట్టారు. ఈ ఒప్పందం అమలయ్యే సమయంలో ఇరు పక్షాలు పరస్పరం శాంతియుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని చెప్పారు. అయితే ప్రపంచశాంతి దృష్ట్యా కాల్పుల విరమణకు ఇరాన్‌ అంగీకరించింది. ఆ తర్వాత కూడా ఇజ్రాయిల్‌ మళ్లీ దాడులకు తెగబడింది. ఈ ఉల్లంఘనపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయిల్‌కు ధీటుగా సమాధానం చెప్పింది. అటుతిరిగి, ఇటుతిరిగి మళ్లీ ఇరాన్‌ అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేస్తుందనే ఆందోళనతో ట్రంప్‌ ఇజ్రాయిల్‌ను తీవ్రంగా మందలించారు. ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు, పైలెట్లను వెనక్కి రప్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో ఆయనే స్వయంగా పోస్ట్‌ పెట్టారు. మరోసారి దాడులు చేస్తే కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టే అవుతుందని ఇజ్రాయిల్‌ను గట్టిగా హెచ్చరించక తప్పలేదు. ఈ విషయాలను ది హేగ్‌లో జరగనున్న నాటో సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తూ వైట్‌హౌస్‌ వద్ద ట్రంప్‌ విలేకర్లతో చెప్పారు.
దౌత్యానికి మళ్ళండి : టర్కీ
కాల్పుల విరమణను గౌరవించాల్సిందిగా టర్కీ కూడా ఇరు పక్షాలను కోరింది. పూర్తి స్థాయిలో ఘర్షణలు విరమించాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్‌ విజ్ఞప్తి చేశారు. చర్చలు, దౌత్య పంథాను అనుసరించాలనీ, ఇందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ కోరింది.
ఖతార్‌పై దాడిగా చూడొద్దు : ఇరాన్‌
తమ దేశంలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి చేసిన నేపథ్యంలో కతార్‌ విదేశాంగ శాఖ, ఇరాన్‌ రాయబారి అలీ సలేహాబదీని పిలిపించి తన నిరసనను తెలియజేసింది. ఈ దాడి ద్వారా ఇరాన్‌ తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని విమర్శించింది. అంతేకాక ఈ దాడి ద్వారా అంతర్జాతీయ చట్టాన్ని, ఐరాస నిబంధనావళిని కూడా ఉల్లంఘించిందని మండి పడింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం దీనిపై స్పందించే హక్కు తనకు ఉన్నదని స్పష్టం చేసిం ది. అయితే అమెరికా వైమానిక స్థావరంపై జరిగిన దాడిని ఖతార్‌పై జరిపిన దాడిగా చూడ వద్దని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చీ చెప్పారు. తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు జరిపిందనీ, ఆత్మరక్షణ కోసమే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని వివరించారు.
ఆపరేషన్‌ సింధు హెల్ప్‌డెస్క్‌ మూసివేత
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ తన విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. విమానయాన సంస్థలకు భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఎయిర్‌ ఇండియా సంస్థ ఇప్పటికే మధ్యప్రాచ్యం, యూరప్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా, కెనడాలోని ఐదు ప్రాంతాలకు కూడా విమానాల రాకపోకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2,576మందికి పైగా భారతీయులు భారత్‌కు తిరిగి వచ్చారు. 292 మందితో కూడిన ప్రత్యేక విమానం ఇరాన్‌ నుండి మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంది. అలాగే ఇజ్రాయిల్‌ నుండి కూడా 366 మంది భారత్‌ చేరారు. ఇజ్రాయిల్‌ నుండి రోడ్డు మార్గంలో జోర్డాన్‌ చేరుకున్న 161 మందిని ఛార్టర్డ్‌ విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. మరో 165 మంది భారతీయులు కూడా అమ్మాన్‌ నుండి సీ-17 సైనిక రవాణా విమానంలో న్యూఢిల్లీకి వచ్చారు. కాగా పశ్చిమాసియాకు బుధవారం నుండి విమాన సర్వీసులు పునరుద్ధరించాలని ఎయిర్‌ ఇండియా నిర్ణయించింది. కాల్పుల విరమణ ప్రకటన నేపథ్యంలో మసాద్‌లో ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ సింధు హెల్ప్‌డెస్క్‌ను భారత్‌ మూసివేసింది.
అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తాం- ఇరాన్‌
ఇజ్రాయిల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం మొదలైందని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. ఒప్పందం అమల్లోకి వచ్చే చిట్టచివరి నిముషం వరకు కూడా తాము అవకాశాలను వదులుకోలేదని, ఇజ్రాయిల్‌ దుందుడుకుతనాన్ని శిక్షించే లక్ష్యంతోనే దాడులు చేశామని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. తమ అణు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

ముప్పు తొలిగింది : నెతన్యాహు
కాల్పుల విరమణను అంగీకరిస్తున్నట్టు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్‌ నుంచి తమకు ఉన్న బాలిస్టిక్‌ క్షిపణులు, అణ్వాయుధాల ముప్పు తొలిగిపోయిందని తెలిపారు. తమ లక్ష్యాలు నెరవేరినందున యుద్ధాన్ని విరమిస్తున్నామని ప్రధాని అధికార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అందించిన సైనిక సాయానికి ఆ లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.

గాజాలో కూడా…
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగానే గాజాలో కూడా కాల్పుల విరమణకు మార్గం సుగమమైంది. ఇరాన్‌ దాడుల దెబ్బకు భీతిల్లిన ఇజ్రాయిల్‌, అమెరికా దేశాలు కాల్పుల విరమణను గాజాకు కూడా విస్తరింపచేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ కార్యాలయం స్వాగతించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -