రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
దేశంలోని అన్ని రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నయీ, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు రాక యువత ఇబ్బందులు పడుతున్నారని, ఇది అందరికీ ఆవేదన కలిగించే విషయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం అయన సూర్యాపేటలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గడచిన 20 నెలల కాలంలో 70 నుండి 75 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, ఇటీవల గ్రూప్ 1,గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడమే కాకుండా ,లైసెన్స్డ్ సర్వేయర్ల కు కూడా నియామక పత్రాలు అందించడం జరిగిందని, అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశ విదేశాల నుండి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రత్యేకించి సూర్యపేట జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి కాలరీస్, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చంజ్ ఆఫ్ తెలంగాణ సహకారంతో హుజూర్నగర్లో ఈ నెల 25న జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ,జాబ్ మేళాకు హాజరయ్య నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇప్పటి వరకు 12,500 మంది ఉద్యోగాల కోసం రిజిస్టర్ చేసుకోగా, ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోనని వారు కూడా జాబ్ మేళాకు రావచ్చు అని చెప్పారు.
15000 మందికి పైగానే నిరుద్యోగ యువత జాబ్ మేళాకు రానున్నట్లు జాబ్ మేలాకు వచ్చే వారికోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ఎస్సి, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు 5 కాపీల రేజ్యుమ్ తో జాబ్ మేళాకు హాజరుకావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సరోత్తం రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, కొప్పుల వేణారెడ్ది, పోతుల భాస్కర్, చింతల లక్ష్మి నారాయణ రెడ్డి, చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.