– కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వ వైఖరి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
– సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబ సభ్యులకు పరామర్శ
– బీఆర్ఎస్ నాయకులు గైర్హాజరు
నవతెలంగాణ-మంచిర్యాల
కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మారణహోమం సృష్టిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్ర వారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆమె.. సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మునీర్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం దేశంలో మారణకాండ సృష్టిస్తోందన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోతే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పకుండా అంత్యక్రియలు సైతం ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. దళిత నాయకులపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, మొన్న జరిగిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో పెట్టలేదని అన్నారు. యాదగిరిగుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి సీఎం రేవంత్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పైన కూర్చున్నారని తెలిపారు. తనకు అవమానం జరిగిందంటూ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ సమసమాజ నిర్మాణానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. అనంతరం టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కేతిరెడ్డి సురేందర్రెడ్డితో కలిసి మంచిర్యాలలోని సింగరేణి కార్మికుడు హర్ష ఇంట్లో సమావేశమ య్యారు. అనంతరం లక్ష్మినగర్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి నీలి శ్రీనివాస్ ఇంటికెళ్లిన కవితకు కుటుంబ సభ్యులు పసుపు బొట్టు, చీర పెట్టి సన్మానించారు.
బీఆర్ఎస్ నాయకులు గైర్హాజరు
మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటనలో బీఆర్ఎస్ జిల్లా నాయకులెవరూ కనిపించకపోవడం స్థానికంగా చర్చకు దారి తీసింది. జిల్లాలోని పలు వివాహాలు, మునీర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంచిర్యాలకు వచ్చిన కవితను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులెవరూ కలవలేదు. దాంతో కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉందని స్థానికుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. స్థానికంగా ఉండే కార్మిక సంఘాల నాయకులతో జిల్లా కేంద్రంలో కవిత సమావేశం నిర్వహించినట్టు సమాచారం.
కగార్ పేరుతో విధ్వంసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES