నవతెలంగాణ-హైదరాబాద్: న్యాయాధికారుల నిర్భందం వెనుక బీజేపీ ఉందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే రాష్ట్రంలోని అధికారులను బదిలీ చేశారని, అదే విధంగా ఎన్నికల రోజు అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని వాపోయారు. మాల్దాలో ఇతర ప్రాంతాలనుంచి మందిని తరలిస్తున్నారని, వారి ద్వారా అల్లర్లకు తెరలేపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హజారీపర్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. “మాల్దాలో జరిగిన సంఘటనపై దర్యాప్తును ఎన్ఐఎకీ అప్పగించారు, విచారణ బృందంలో వాళ్లకు నచ్చిన ముంబయి వ్యక్తులను నియమించుకున్నారు. బీజేపీ ప్రతిదీ ప్లాన్ చేసింది, అయితే ఎన్ఐఎ వారిని పట్టుకోలేక పోయినప్పటికీ, మా సిఐడి వారిని అరెస్టు చేసింది” అని పేర్కొన్నారు. సర్ సర్వేతో అనేక మంది ఓటర్లను రాష్ట్రంలో తొలగించారని, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుందని మండిపడ్డారు.



