సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 29న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ నిరసన కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెలంతా స్థానికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. నివాస, పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్లు యాజమాన్యాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లారుమెంట్ విధానాన్ని తేవడం దుర్మార్గమన్నారు. ఇది కార్మికులను దోచుకోవడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఇప్పటికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవోను అడ్డం పెట్టుకుని పెట్టుబడిదారులు కార్మికుల్ని మరింతగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీనియర్ నాయకులు ఆర్.సుధా భాస్కర్, కోశాధికారి వంగూరు రాములు, ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, కె. ఈశ్వర్రావు, కార్యదర్శి పద్మశ్రీ, పుప్పాల శ్రీకాంత్, కూరపాటి రమేష్లు తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై 29న కలెక్టరేట్ల ఎదుట ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES