దర్శకుడు ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి కన్నుముశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఆకాశ్ హీరోగా, అర్జు గోవిత్రికర్ హీరోయిన్గా నటించిన ‘మనసుతో…’ సినిమాతో ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. వి.ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన ‘యజ్ఞం’ సినిమాతో రవికుమార్ చౌదరికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాను ఈతరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించారు. ఆ బ్యానర్లోనే ‘ఏం పిల్లా… ఏం పిల్లడో’ సినిమానూ తనీష్ హీరోగా రవికుమార్ చౌదరి తెరకెక్కించారు. అలాగే బాలకష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్తేజ్తో ‘పిల్ల నువ్వు లేని జీవితం’, గోపిచంద్తో ‘సౌఖ్యం’, నితిన్తో ‘ఆటాడిస్తా’ వంటి సినిమాలను రూపొందించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘తిరగబడరా సామి’. ‘యజ్ఞం’, ‘పిల్ల నువ్వు లేని జీవితం’ చిత్రాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఆయన ‘పిల్ల నువ్వు లేని జీవితం’ చిత్రానికి సంబంధించి ఉత్తమ స్క్రీన్ప్లే రైటర్గా నంది అవార్డును దక్కించుకున్నారు. తక్కువ చిత్రాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రవికుమార్ చౌదరి మృతిపట్ల తెలుగు చిత్ర దర్శకుల సంఘం సంతాపాన్ని తెలిపింది.
దర్శకుడు రవికుమార్ చౌదరి కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES