నవతెలంగాణ-భూపాలపల్లి
వర్షాకాలంలో సంభవించే వరదల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసీ కార్యాలయ సమావేశపు హాలులో వర్షాకాలంలో వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖల అధికారులతో సన్నద్దత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… .గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే వర్షాకాలంలో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మన జిల్లాకు ప్రత్యేక రిజర్వ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 2023వ సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదయిందని, చెరువులు తెగిపోయి మోరంచపల్లి గ్రామంతో పాటు మరి కొన్ని గ్రామాలు వరద ముంపు గురయ్యాయని తెలిపారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా చెరువులను పరిశీలించి పటిష్టతను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. చెరువు కట్టలను పరిశీలించాలని సూచించారు.
చెరువులలో నీటి నిల్వలపై ప్రతి రోజు పై నివేదికలు అందించాలని తెలిపారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు కల్వర్టులు, లోలెవల్ వంతెనలు, పాత వంతెనలను పరిశీలించి తగు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతి, మున్సిపాల్టీ అధికారులు గ్రామాలు, పట్టణ పరిధిలో వరదలు సంభవించే ప్రాంతాలల్లో చెత్త చెదారాలను తొలగించి. మురుగు కాల్వలు పరిశుభ్రం చేయాలన్నారు. వరద ప్రవాహానికి నీటి మునిగే గ్రామాలలో కాలువలల్లో వ్యర్థాలు వేయకుండా చూడాలని సూచించారు. నీటి నిల్వలు వల్ల మురుగునీటి కాల్వల నుండి నీరు పారి ప్రజలకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. గ్రామాలలోను, మున్సిపల్ పరిధిలోను శిధిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వర్షాల సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.
అంటు వ్యాధులు నియంత్రణకు దోమల మందు పిచికారి చేయాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు వరదలు సంభవించే ప్రాంతాలల్లోను, వాగులు, చెరువు కట్టలు, ముంపు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వరిగిపోకుండా దృఢంగా ఉండేంలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మత్స్య శాఖ ద్వారా గ్రామాల వారిగా గజ ఈతగాళ్లును అందుబాటులో తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా ముంపు ప్రాంత రైతులను అప్రమత్తం చేయాలని ఎరువులు, ఇతర వ్యవసాయ సంబంధిత వస్తువులు భద్రపరిచేలా అవగాహన కల్పించాలని సూచించారు. వరదలు సమయంలో వ్యవసాయ పనిముట్లు ముంపుకు గురికాకుండా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలలో భాగంగా ప్రసవ సమయం దగ్గర ఉన్న గర్భిణీ స్త్రీలను గుర్తించి సురక్షిత ప్రాంతాలను తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. నీటి నిల్వలు ఉన్న చోట దోమలు వ్యాప్తి నిరోదానిక్ ఆయిల్ బాల్స్ వేయాలని, ఆశా సిబ్బంది గ్రామాలలో క్షేత్ర స్థాయిలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, వర్షాకాలంలో కావలసిన వ్యాక్సిన్ లు ,ఇతర మందులను సమృద్ధిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఆర్ డబ్ల్యూ ఈఎస్ శాఖ ద్వారా త్రాగు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని క్లోరోస్కోప్ పరికరం ద్వారా ప్రతి రోజు నీటి నాణ్యతలను పరిశించాలని తెలిపారు.
అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్
అధ్వర్యంలో 20 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏదేని సమయంలో ఎక్కడ చెరువులు తెగినా వరదలు వచ్చిన అధికారులు వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని పోలీస్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని గత 5 సంవత్సరాలలో తహసీల్దార్ లు తమ మండలాల పరిధిలో ఎక్కడ ఎక్కడ వరదలు సంభవిస్తాయో అట్టి ప్రాంతాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. ప్రతి మండలంలో సహాయక కేంద్రాల ఏర్పాటుకు గజ ఈతగాళ్లు, అందుబాటులో ఉన్న బోట్లను రెడీ చేసే పెట్టుకోవాలని అందరూ అధికారులు సమన్వయంగా ఉంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇరిగేషన్, పంచాయతి, డిఆర్డీఓ, తహశీల్దార్లు, ఎంపిడిఓలు,మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.