నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్బాస్ తెలుగు 9వ సీజన్లో అసలైన మసాలాకు రంగం సిద్ధమైంది. ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగుపెట్టిన ఈ మెగా రియాలిటీ షోలోకి వివాదాస్పద నేపథ్యంతో వార్తల్లో నిలిచిన దివ్వెల మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు, ఆటలో మరింత వేడి పెంచేందుకు నిర్వాహకులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాధురితో పాటు మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి అడుగుపెడుతున్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న సంబంధం కారణంగా దివ్వెల మాధురి పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారుమోగింది. అప్పటికే వివాహితుడైన శ్రీనివాస్తో ఆమె రిలేషన్షిప్లో ఉండటం కుటుంబ వివాదాలకు దారితీసింది. ఈ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్గా మారి, ఆమెకు అనూహ్యమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో రీల్స్, డ్యాన్స్ వీడియోలతో చురుగ్గా ఉండే మాధురి, చీరల వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. గతంలో చాలాసార్లు బిగ్బాస్ ఆఫర్లు వచ్చినా కుటుంబానికి దూరంగా ఉండలేక తిరస్కరించిన ఆమె, ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా రావడానికి అంగీకరించారు.
బిగ్బాస్ హౌస్లోకి వెళ్లే ముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “బిగ్బాస్ అనేది మనల్ని మనం నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదిక. ఇక్కడికి రావడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. నాకున్న పాపులారిటీని మరింత పెంచుకోవడానికి, ఎక్కువ మందికి చేరువ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. 80 ఏళ్లు దాటిన మహిళలు కూడా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. నా కోసం పూజలు చేస్తున్నామని చెబుతున్నారు. ఒకవేళ టైటిల్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీని కూడా సేవా కార్యక్రమాలకే వినియోగిస్తాను” అని స్పష్టం చేశారు. అయితే, దువ్వాడ శ్రీనివాస్ను, తన పిల్లలను బాగా మిస్ అవుతానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.