– గాంధీ కుటుంబానికే విధేయుడ్ని అని ప్రకటన
బెంగళూరు : ఇటీవల అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడినందుకు కర్నాటక ఉపముఖ్యమంత్రి, కెపిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్, పార్టీకి, గాంధీ కుటుంబానికి తాను విధేయతను శివకుమార్ మరోసారి పునరుద్ఘాటించారు. గతవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగింది. ఈ చర్చల్లో శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే సదా వత్సలే మాతృభూమిలో కొంతభాగాన్ని పాడారు. దీనిపై వివాదం చెలరేగుతోంది. దీంతో మంగళవారం విలేకరులతో శివకుమార్ మాట్లాడుతూ తన చర్యతో కాంగ్రెస్, ఇండియా బ్లాక్లో ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు అని చెప్పారు. 1980 నుంచి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి తాను విధేయుడిగా ఉంటున్నాని తెలిపారు. ‘పార్టీ హైకమాండ్లో ఎవ్వరూ తనను క్షమాపణలు చెప్పమని అడగలేదని తెలిపారు. ‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం పట్ల నాకున్న విధేయతను ఎవ్వరూ ప్రశ్నించలేరు. నేను కాంగ్రెస్ వాదిగా పుట్టాను. కాంగ్రెస్ వాదిగా మరణిస్తాను’ అని విలేకరులకు శివకుమార్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ గీతం పాడటం గురించి మాట్లాడుతూ తన చర్యను కొంతమంది రాజకీయం చేయడానికి, ప్రజలను గందరగోళంపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడ్డంలో తన ఉద్దేశ్యం ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడం కాదని అన్నారు. అలాగే, ఇడి దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని తీహార్ జైలులో తాను గడిపిన అనుభవాన్ని శివకుమార్ గుర్తుచేస్తూ.. ‘ఎవరైనా నా చరిత్ర, నా నిబద్ధత, నా భావజాలం తెలుసుకోవాలనుకుంటే, దానితో రాజకీయాలు చేయాలనుకుంటే, అది వారికే వదిలేస్తున్నాను. నేను వ్యాఖ్యానించదలచుకోలేదు’ అని అన్నారు.
ఆర్ఎస్ఎస్ గీతం పాడినందుకు డికె శివకుమార్ క్షమాపణలు
- Advertisement -
- Advertisement -