నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల రైల్వే టికెట్ల ధరలను పెంచుతున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోడీకి గురువారం లేఖ రాశారు. భారతీయ రైల్వే అనేది పేద, మధ్య తరగతి ప్రజలకు కేవలం ఒక ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు.. వారి జీవితాల్లో ఒక అంతర్భాగమని లేఖలో పేర్కొన్నారు. అయితే, నేను చెన్నై నుంచి కాట్పాడికి రైలులో ప్రయాణించగా, కాట్పాడి ప్రజలు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తుంది.. కానీ ఈసారి వారిలో అంత ఉత్సాహం కనిపించలేదని స్టాలిన్ అన్నారు.
అయితే, దీనికి ప్రధాన కారణం ఏంటా అని ఆరా తీయగా వచ్చే నెల నుంచి రైల్వే చార్జీలు పెంచబోతున్నారు అనే విషయం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేస్తుందనే విషయాన్ని గ్రహించాను అని సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి ప్రజలపై రైలు చార్జీలను పెంచి ప్రయాణ భారాన్ని మోపొద్దని ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్లకు ప్రజల తరపున విఙ్ఞప్తి చేస్తున్నట్టు ఆ లేఖలో ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
ఇదిలావుండా కేంద్ర నిర్ణయ ప్రకారం ఎక్స్ప్రెన్, నాన్ ఏసి రైళ్లకు కిలోమీటరుకు 1 పైసా, ఏసి తరగతులకు కిలో మీటరుకు 2 పైసలు పెరగనున్నాయి. అయితే 500 కి.మీ వరకు ప్రయాణాలకు సబర్బన్ టిక్కెట్లు, సెకండ్ క్లాస్ ప్రయాణాలకు చార్జీల పెంపు వర్తించదు. 500 కి.మీ దాటితే సెకండ్ క్లాస్కు కిలో మీటరుకు అరపైసా పెంపు ఉండనుంది. రోజువారీ, నెలవారీ సీజన్ టిక్కెట్ల ధరల్లో కూడా మార్పు ఉండదని ఆ వర్గాలు తెలిపాయి. అదే విధంగా తత్కాల్ బుకింగ్లో కూడా నిబంధనలను మారనున్నట్లు ఆ వర్గాలు ప్రకటించాయి. 2025 జులై1 నుండి ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసిన ప్రయాణికులు మాత్రమే ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉండనుంది.