నవతెలంగాణ-హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 81వేల పాయింట్లకు దిగువకు పడిపోయింది. ఆటో మినహా చాలారంగాల్లో అమ్మకాలు కనిపించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,946.43 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,010.49 గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,554.40 పాయింట్లకు పడిపోయింది. చివరకు 308.47 పాయింట్లు తగ్గి 80,710.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.20 పాయింట్లు పతనమై.. 24,649.55 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనల నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
అయితే, ఆటో స్టాక్స్ మాత్రం కొంత వరకు నష్టాల నుంచి గట్టెక్కించాయి. ఆటో ఇండెక్స్ 0.4 శాతం పెరగ్గా.. బ్యాంక్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయాయి. టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి, ఎస్బీఐ లైఫ్, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి. రాజీవ్ ఆనంద్ను కొత్త సీఈవోగా నియమించడానికి ఆర్బీఐ ఆమోదం పొందడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు పెరిగాయి. పేటీఎం షేర్లు 2శాతం క్షీణించాయి.