– ఉద్యోగార్ధులకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ రఘుమారెడ్డి హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
డబ్బులిస్తే, ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు విని నిరుద్యోగులు మోసపోవద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎమ్డీ జీ రఘుమారెడ్డి హెచ్చరించారు. తమ సంస్థ పరిధిలో 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం 2023 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్ష నిర్వహించిందని తెలిపారు. నియామక ప్రక్రియలో భాగంగా మెరిట్, రూల్ అఫ్ రిజర్వేషన్ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 28 నుంచి వివిధ జిల్లా/సర్కిల్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, పోల్ క్లైమ్బింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నదని వివరించారు. దీనికి సంబందించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. దళారులు సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తే నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అలాంటి వారిపై తక్షణం సమీప పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.