Monday, June 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅతిథి అధ్యాపకుల గోస పట్టదా..!

అతిథి అధ్యాపకుల గోస పట్టదా..!

- Advertisement -

– కొత్త నియామకాలతో ఉపాధి కోల్పోయిన వెయ్యికిపైగా కుటుంబాలు
– 12 ఏండ్లుగా అతితక్కువ వేతనాలతో నెట్టుకొచ్చిన వైనం
– మాటలతో సరిపెడుతున్న మంత్రులు, కమిషనర్‌
– విద్యాసంవత్సరం ప్రారంభమైనా విధులపై స్పష్టత కరువు
– కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి లేకుంటే ఆందోళనలే..
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఉపాధి కోల్పోయిన అతిధి ఆధ్యాపకులు గోస పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విద్యార్థులకు 12ఏండ్లుగా విద్యాబుద్ధులు నేర్పించిన అధ్యాపకులను ఒక్కసారిగా విధుల్లోంచి తీసెయ్యడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇటీవల తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో కొత్తగా 1254 మంది అధ్యాపకులను నియామకం చేయడంతో అప్పటివరకు పనిచేస్తున్న అతిధి అధ్యాపకులను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి తొలగించింది. వీరి స్థానంలో కొత్తగా నియామకమైన వారిని భర్తీ చేసింది. దాంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వేడుకుంటున్నారు.
రాష్ట్రంలో మొత్తం 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా.. వీటిలో 1,654 మంది అతిథి అధ్యాపకులుగా గత సంవత్సరం వరకు కొనసాగారు. గతేడాది జూనియర్‌ అధ్యాపకుల భర్తీ ప్రక్రియలో 1,250 అధ్యాపకులను ప్రభుత్వం భర్తీ చేసింది. దాంతో ఒకేషనల్‌ గ్రూపుల్లో పనిచేస్తున్న 350, జనరల్‌ గ్రూపుల్లో పనిచేస్తున్న 150 మంది అతిధి అధ్యాపకులు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా మిగిలారు. దీంతోపాటు ప్రస్తుత సంవత్సరం 20 జూనియర్‌ కళాశాలలు అదనంగా రాగా.. వాటిలో మరో 200 మంది వరకు చోటు దొరికే అవకాశం ఉంది. వీరంతా పోను ఇంకా సుమారు వెయ్యి మంది అతిథి అధ్యాపకులు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏండ్ల తరబడి పనిచేసినా దొరకని భద్రత
ఉమ్మడి రాష్ట్రంలో 2012 వరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు వ్యవస్థలో అధ్యాపకులను తీసుకున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టు వ్యవస్థలో తీసుకోవడం నిలిపివేసి.. అతిధి అధ్యాపకులంటూ పీరియడ్‌ వ్యవస్థను 2013లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. దాంతో అప్పటి నుంచి కళాశాలలో పదవీ విరమణ, పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను అతిధి అధ్యాపకులతో భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ కళాశాల అభివృద్ధి కోసం పీరియడ్ల ప్రాతిపదికన గరిష్టంగా నెలకు రూ.28,080 వేల అతితక్కువ వేతనాలతో 12 ఏండ్లుగా పనిచేస్తున్నారు. తాజాగా గత సంవత్సరం ప్రభుత్వం ఏకబిగిన ప్రభుత్వ కళాశాలలో 1254 జూనియర్‌ అధ్యాపక పోస్టులు భర్తీ చేయడంతో రాష్ట్రంలో 2013 నుంచి అతిధి అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. ఉద్యోగ భద్రత లేకపోగా ప్రస్తుతం వ్యవస్థలో నుంచి తమను వెళ్లగొట్టడం తీరని అన్యాయం చేయడమే అవుతుందని అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏండ్ల నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం కోసం కృషి చేస్తున్న తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న అమలు కానీ వైనం
2023లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న 1,654 మంది అధ్యా పకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు, 12 నెలలు రూ.42,000 జీతం అందిస్తామని ప్రకటించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా అతిధి ఆధ్యాపకులు వారి కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేశాయి. అయితే అది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. గతంలో పెండింగ్‌లో ఉన్న జేఎల్‌ నోటిఫికేషన్‌లో భాగంగా పరీక్ష నిర్వహించి అధ్యాపకులను భర్తీ చేయడం అతిథి అధ్యాపకులు రోడ్డున పడటం క్షణాల మీద జరిగిపోయాయి. ప్రస్తుతం అటు మంత్రులు గాని ఇటు కమిషనర్‌, అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
మంత్రులు, అధికారుల వింత సమాధానాలు!
అతిథి అధ్యాపకులు తమ సమస్యకు సంబంధించి కొలువులు కోల్పోయిన వారిని ఇతర చోట్ల భర్తీ చేయడానికి మంత్రులను కలవగా వారు అతిథి అధ్యాపకులను కాపాడు కుంటామనీ.. అండగా ఉంటామని చెబుతున్నారు. అలాగే కమిషనర్‌ స్థాయి అధికారులు కూడా ఇదే సమా ధానం చెబుతున్నప్పటికీ.. కళాశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా కనీసం తమ గురించి ఎటువంటి నిర్ణయం లేకపోవడంపై త్రిశంకు స్వర్గంలో అతిథి అధ్యాపకులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఇలానైనా ఆదుకోండి..!
రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు అధికంగా ఉన్నారు. వీటిలో అదనంగా ఒక్కొక్క పోస్టు పెంచినట్టయితే అతిధి ఆధ్యాపకులకు కొంత మేలు జరుగుతుంది. అలాగే పలు కళాశాలల్లో గత రెండేండ్ల నుంచి ఆంగ్ల మాధ్యమం క్లాసులు సైతం కొనసాగుతున్నాయి. వాటికి ప్రత్యేకంగా పోస్టులు మంజూరు చేస్తే అతిథి ఆధ్యాపకులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఈ దిశగా ఆలోచించి తమకు తిరిగి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అతిధి ఆధ్యాపకుల విషయంలో ఇచ్చిన హామీ నెరవేర్చి.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇదే విషయమై దాదాపు 500కుపైగా అతిథి అధ్యాపకులు నేడు ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ కృష్ణ అదిత్యను కలిసేందుకు హైదరాబాద్‌ వస్తున్నారనీ, కమిషనర్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళనలకు దిగాలని అతిథి అధ్యాపకులు నిర్ణయించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -