– శ్రామికులు తలుచుకుంటే ఎవరి కుర్చీలూ ఉండవు
– మోడీజీ..ఉపాధి కూలీలకు రూ.400 ఏమైంది?.. సీఎంవి చేతగాని మాటలు
– హామీలు అమలు చేయకుంటే ఆ కుర్చీలో ఎందుకు? : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
– ప్రజల సమస్యలు వినే ఓపిక అధికారులకు లేదు : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు
– వ్యకాస ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
– రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో పోలీసులకు, నాయకులకు మధ్య ఘర్షణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
”ప్రధాని మోడీ పేదల పొట్టగొట్టడం మానుకో.. శ్రామికులు తల్చుకుంటే ప్రధాని కుర్చీ ఉండదు.. మీ మంత్రులు, మీ అధికార యంత్రాంగం వీధుల్లో తిరగలేరు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద దేశంలో 30 కోట్ల మంది పేదలు పని చేస్తున్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే బీజేపీని గద్దెదించడం ఖాయం.” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ‘ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలి.. పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. స్థానిక సమస్యలు పరిష్కరించాలి’ అని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉపాధి కూలీలు ధర్నా చేపట్టారు. దీనికి సీపీఐ(ఎం) మద్దతు తెలిపింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పాల్గొని మద్దతు తెలిపారు. ధర్నాలో కూలీలు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలతో హౌరెత్తించారు. ‘పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలి. దినసరి కూలి రూ.600 ఇవ్వాలి. పని ప్రదేశంలో రక్షణ కల్పించాలి. కొలతలతో సంబంధం లేకుండా వేతనం చెల్లించాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్ తమ వద్దకు వచ్చి హామీ ఇచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేదీ లేదని భీష్మించు కూర్చున్నారు. కలెక్టర్, గ్రామీణాభివృద్ధి అధికారి రాకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఏసీపీ రాజు జోక్యంతో సద్దుమణిగింది. కలెక్టర్ కార్యాలయ అధికారి ధర్నాస్థలికి చేరుకోగా కలెక్టర్ లేదా పీడీ వస్తేనే వినతి పత్రం ఇస్తామని.. ఏవోకు వినతిపత్రం ఇవ్వడానికి నిరాకరించారు. అనంతరం కొంగర్ కాలన్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. కనీస ఉపాధి అవకాశాలు కల్పించాలని, తమ శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని మాత్రమే పేద ప్రజలు.. ఈ ప్రభుత్వాలను అడుగుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టమని అడగడం లేదని తెలిపారు. చట్టం ప్రకారం ఏడాదికి 100 రోజులు పని కల్పించాల్సిన ప్రభుత్వం 40 నుంచి 50 రోజులు కూడా పని కల్పించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఏడాది మొత్తం పేద ప్రజలు ఏమీ చేసి బతకాలని ప్రశ్నించారు. దేశంలో ఉపాధి కూలీ పనులు చేసేవారు లేరని మోడీ ప్రభుత్వం చెబుతోందని, కానీ ఉపాధి హామీ చట్టం కింద జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 65 లక్షల మంది ఎవరనీ ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న 30 కోట్ల మంది కూలీలు కాదా అని ప్రశ్నించారు. చట్టం ప్రకారం దినసరి కూలి రూ.307 ఇవ్వాలని.. కానీ కనీసం రూ. 100 కూడా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలు తలుచుకుంటే బీజేపీ కుట్రలను తిప్పికొట్టగలరని స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దినసరి కూలి రూ.600 చెల్లించి. ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి విస్మరించారన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతగాని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధి కూలీలకు ఏడాదికి 150 పనిదినాలు, దినసరి కూలి రూ. 400 ఇస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని అన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న రూ.12 వేల ప్రస్తావన ఏమైందని ప్రశ్నించారు. హామీలను అమలు చేయడం చేతకానీ సీఎం ఎందుకని.. ఆ కుర్చీ నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న నాయకులు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారే తప్పా పేదల కోసం ఆలోచన చేయడం లేదన్నారు. ఇలాంటి నాయకత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ఉపాధి హామీకి దేశ బడ్జెట్లో రూ. 2లక్షలా 50 వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నప్పటికీ రూ.80 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వ వైఖరి పేద ప్రజల పట్ల ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రానికి 20 కోట్ల పనిదినాలు అవసరం ఉంటే.. కేవలం 6 కోట్ల 50లక్షలు మాత్రమే కేటాయించిందన్నారు. ఇదేనా పేదల కోసం పనిచేయడం అంటే అని రాష్ట్ర బీజేపీ ఎంపీలను నిలదీశారు. ప్రజల సమస్యలు వినే ఓపిక అధికారులకు లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), వ్యకాస నాయకులు, ఉపాధి హామీ కూలీలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట వ్యకాస ధర్నా
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా ఖమ్మంలో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తోపులాట జరిగింది. అనంతరం పోలీసుల అనుమతితో కొంతమందిని కలెక్టరేట్లోకి పంపించగా.. కలెక్టర్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కూలీలు భైటాయించి రెండు గంటల పాటు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఆదివాసీ గిరిజన సంఘం మద్దతు తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో భారీగా కూలీలు పాల్గొన్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు.
పేదల పొట్టకొట్టొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES