నా రాజకీయం గురించి నా భవిష్యత్తు గురించి నేను మీడియా సమావేశం పెట్టి చెబుతా!
తనపై మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను పుకార్లను ఖండిస్తున్న.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కొన్ని చానల్లో సోషల్ మీడియాలో నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తప్పుడు వార్తలు వస్తున్నాయి. నా రాజకీయం గురించి నా భవిష్యత్తు గురించి నేను మీడియా సమావేశం పెట్టి చెబుతా! అప్పటివరకు ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. గురువారం చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ప్రయివేట్ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదన్న రాజగోపాల్ రెడ్డి` అనే శీర్షికన నేను అనని మాటలు అన్నట్లు ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మొట్టమొదటి అసెంబ్లీలో ప్రస్తావించిందే నేను అని పేర్కొన్నారు.
నాకు మంత్రి పదవి రానందుకు రేవంత్ రెడ్డిపైన, ప్రభుత్వం పైన నేను అనని మాటలను అన్నట్టు తప్పుడు కథనాలను సృష్టించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పైన వచ్చే తప్పుడు వార్తలను అబద్దాలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీపైన సోనియా గాంధీ పైగా, రాహుల్ గాంధీ అన్నా ఎంతో అభిమానం అని చెప్పారు.
మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నేపథ్యం. నేను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు రాస్తున్నారు. కొందరు గిట్టని వ్యక్తులు నా ప్రతిష్ట దెబ్బతీయడానికి సోషల్ మీడియా ద్వారా అవస్తవాలు పుకార్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దయచేసి తెలంగాణ సమాజం పుకార్లను నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాలలో అంతర్గతంగా బహిర్గతంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని కొన్ని వేదికల్లో చెప్పానని తెలిపారు.
త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో కొంతమంది అనుకూలంగా మార్చుకున్నారని అనుమానాలు ఉన్నాయి. భూ నిర్వాసితుల విషయంలో కూడా తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం చెప్పాను. అని వివరించారు.
ఈరోజు కూడా నేను గుంటూరు ఓ ప్రయివేట్ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్తుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నాడని పుకార్లు సృష్టిస్తున్నారు. నేను గుంటూరు వెళుతున్నాను అంటే మా నియోజకవర్గంలో నుంచి కూడా కొంతమంది నాయకులు నాతో వస్తా అన్నారు. నేను మా నాయకులు కలిసి గుంటూరులో ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అటు నుండి విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నాం అని చెప్పారు.
దానికి నేను జగన్ ను కలవడానికి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నా రాజకీయం గురించి నా భవిష్యత్తు గురించి నేను మీడియా సమావేశం పెట్టి చెబుతాను తప్ప అప్పటివరకు ఈ దుష్ప్రచారాలను నమ్మకండని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాను అని పేర్కొన్నారు.