– విక్రయించాలంటేనే భయం కలిగేలా వ్యవహరించాలి
– 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
– ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. దేశంలోనే గొప్ప నిర్ణయం
– అట్టహాసంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు : ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించకూడదని, నకిలీలు విక్రయించాలంటేనే భయం కలిగే రీతిలో చర్యలుండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. వానాకాలం సాగుకోసం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు కావాల్సినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే రికార్డు స్థాయిలో ఈ సీజన్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం సేకరణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ముందంజలో ఉండటం అభినందనీయమని తెలిపారు. పేదల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం దేశ చరిత్రలోనే చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి నడుం కట్టామన్నారు. చట్టాల ద్వారా వచ్చిన హక్కులను కాలరాసేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకువచ్చిందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంగాళాఖాతంలో కలిపి.. రైతులకు సరళమైన, సులభతరమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వెల్లడించారు. భూ భారతి అమల్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎర్రుపాలెం, ములుగుమాడును ఎంపికచేశామని, జూన్3 తర్వాత అక్కడ సర్వే ప్రారంభమవు తుందని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య, ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విత్తనాల కొరత రావొద్దు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
విత్తనాల కొరత రాకుండా జిల్లాల్లో అధి కారులు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. స్టాక్ వివరాలను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ప్రతి మండలంలో అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉంచాలని కోరారు.
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలని, అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను అధికారులు నిరంతరం చెక్ చేయాలన్నారు. నకిలీ విత్తనాలపై తీసుకుంటున్న చర్యలను వెంటనే పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు.
పొజిషన్లో ఉన్న పేదలకు పట్టాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
అసైన్డ్ భూముల్లో పొజిషన్ ఉన్న నిరుపేదలకు పట్టాలివ్వాలని ప్రభుత్వం భావిస్తోందని, సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సాదా బైనామాలో ప్రభుత్వ భూములకు కూడా కొంతమంది దరఖాస్తులు చేసుకున్నారని, వీటిని తిరస్కరించాలని అన్నారు. హైకోర్టు నుంచి స్టే తొలగిన వెంటనే అర్హత ఉన్న సాదా బైనామాలను పరిష్కరిస్తామని తెలిపారు. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పెట్టుబడి సొమ్ము లేకపోతే మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనం మాటే వినిపించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES