Sunday, June 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరిఫరల్‌కే పరిమితం కావొద్దు

రిఫరల్‌కే పరిమితం కావొద్దు

- Advertisement -

– చిన్నచిన్న వ్యాధులకు మీరే వైద్యం చేయండి
– మీ సామర్థ్యం నిరూపించుకోండి
– వైద్య విభాగానికి ఏటా రూ.400 కోట్ల వ్యయం : సింగరేణి ఏరియా ఆస్పత్రుల వైద్యాధికారులతో సీఎమ్‌డీ ఎన్‌ బలరాం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

సింగరేణి ఏరియా ఆస్పత్రుల వైద్యాధికారులు పేషెంట్లను పెద్దాస్పత్రులకు రిఫరల్‌ చేయడానికే పరిమితం కావొద్దని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌ బలరాం అన్నారు. చిన్నచిన్న వ్యాధులకు అక్కడికక్కడే సొంతంగా వైద్యం చేసి, వారిలోని సామర్థ్యాన్ని వినియోగించాలని సూచించారు. ఏటా సింగరేణి వైద్యవిభాగానికి రూ.400 కోట్లు ఖర్చవుతున్నదని తెలిపారు. కేసులన్నీ రిఫరల్‌ చేస్తే వైద్యుల నైపుణ్యత ఏమిటని ప్రశ్నించారు. సమయ పాలన పాటిస్తూ, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గురువారంనాడాయన సింగరేణి అన్ని ఏరియా ఆస్పత్రుల పనితీరుపై వైద్యాధికారులతో హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కోవిడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య పరీక్షల యంత్రాలు, ఔషధాలు సమకూర్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాననీ, అయినా కొన్ని ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రతిపాదనలు పంపడంలో ఎందుకు శ్రద్ధ చూపట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి తన తనిఖీల్లో ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, మందులు లేవనే విషయం తెలిస్తే, ఉపేక్షించబోననీ, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనలకు వార్షిక ప్రణాళికలతో సంబంధం లేదని స్పష్టంచేశారు. ఏరియా ఆస్పతులకు ఇప్పటికే వైద్యులు, టెక్నీషియన్లను కేటాయించామనీ, అవసరం అయితే ఇంకా ఏర్పాట్లు చేస్తామన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఏరియా ఆస్పత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నా, అలా చేయకుండా వెంటనే హైదరాబాద్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారనీ, దీనివల్ల గత మూడేండ్లలో రూ.30 కోట్లు ఉన్న రిఫరల్‌ బిల్లులు ఇప్పుడు రూ.100 కోట్లకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ డాక్టర్లు తమ సమర్థతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతి చిన్న కేసును రిఫర్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఏరియా ఆస్ప త్రులను ఆధునీకరిస్తున్నామనీ, హైదరాబాద్‌లోనూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతు న్నాయని తెలిపారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్య నారాయణ రావ, ఎల్వీ సూర్యనారాయణరావు, కె.వేంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోల్‌ మూమెంట్‌ ఎస్డీఎమ్‌ సుభానీ, జీఎం(మార్కెటింగ్‌) ఎన్వీ రాజశేఖరరావు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కిరణ్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -